Ukraine : రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు తాము చొరవ తీసుకుంటామని, ఉక్రెయిన్లోని అరుదైన ఖనిజాల తవ్వకానికి తమను అనుమతించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై ఇరుదేశాల ఒప్పందానికి తొలి అడుగు పడినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. ఇందులోభాగంగా కీవ్, వాషింగ్టన్ మెమోరాండంపై సంతకం చేశాయని ఉక్రెయిన్ ఆర్థికమంత్రి యులియా స్విరిడెంకో వెల్లడించారు.

కీలకమైన ఖనిజాలను పొందడానికి మార్గం సుగమం అవుతుంది
మా అమెరికన్ భాగస్వాములతో మెమోరాండం ఆఫ్ ఇంటెంట్పై సంతకం చేసినట్లు ప్రకటించడానికి సంతోషిస్తున్నాం. ఈ ఒప్పందం ఇరుదేశాల ఆర్థిక భాగస్వామ్యం, దేశ పునర్నిర్మాణం, మౌలిక సదుపాయాల ఆధునికీకరణ, వ్యాపారాలలో మద్దతు, కొత్త ఆర్థిక అవకాశాల సృష్టికి పెట్టుబడులు వంటి వాటికి ఉపయోగపడుతుందని భావిస్తున్నాం అని యులియా స్విరిడెంకో సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఈవిషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధ్రువీకరించారు. ఈ ఒప్పదం ద్వారా అగ్రరాజ్యం ఉక్రెయిన్ నుంచి సహజ వనరులు, కీలకమైన ఖనిజాలను పొందడానికి మార్గం సుగమం అవుతుందని పేర్కొన్నారు.
తమకు ఖనిజాలు లభిస్తే.. ఆ దేశానికి అవసరమైన వాటిని అందిస్తాం
గతంలో ఈ ఒప్పందం గురించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్కు తాము 500 బిలియన్ డాలర్ల డీల్ను ప్రతిపాదించామన్నారు. దానికి జెలెన్స్కీ సైతం అంగీకరించారని తెలిపారు. తమకు ఖనిజాలు లభిస్తే.. ఆ దేశానికి అవసరమైన వాటిని అందిస్తామన్నారు. మరోవైపు.. ‘వాషింగ్టన్ ఇచ్చింది 100 బిలియన్ డాలర్లయితే.. 500 బిలియన్ డాలర్లకు ఒప్పందం అడగకూడదు’ అంటూ జెలెన్స్కీ కౌంటర్ ఇచ్చారు. ఈక్రమంలో తాజాగా ఉక్రెయిన్ ట్రంప్ డీల్పై సంతకాలు చేయడం గమనార్హం.
Read Also: భగవద్గీత, నాట్య శాస్త్రానికి యునెస్కో గుర్తింపు