ఉక్రెయిన్కు సైనిక సాయాన్ని నిలిపివేస్తున్నట్లు అమెరికా ప్రకటించిన గంటల్లోనే, ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ దిగివచ్చారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో వాగ్వాదం విచారకరమని, తప్పిదాలను సరిదిద్దుకోవడానికి ఇదే సరైన సమయమని భావిస్తున్నట్లు తెలిపారు. ఉక్రెయిన్లో శాంతి నెలకొల్పేందుకు ట్రంప్ బలమైన నాయకత్వంలో పనిచేసేందుకు సిద్ధమని సామాజిక మాధ్యమం ఎక్స్లో జెలెన్స్కీ పోస్ట్ చేశారు.
ఖనిజాల తవ్వకాలపై సంతకాలకు సిద్ధం
ఇటీవల శ్వేతసౌధంలోని ఓవల్ ఆఫీసులో అనుకున్న విధంగా కార్యక్రమం జరగలేదు. అది దురదృష్టకరం. దీనిని సరిచేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఇకపై ఇలాంటి చర్చలు, సహకారం నిర్మాణాత్మకంగా ఉండేలా చూసుకుంటాం. ట్రంప్ సర్కారు కోరుతున్న రీతిలో అరుదైన ఖనిజాల తవ్వకాలపై సంతకాలు చేయడానికి మేం సిద్ధం. దీంతోపాటు మా భద్రతపై ఎప్పుడైనా, ఏ రూపంలోనైనా సంతకాలకు తయారుగా ఉన్నాం. ఎంతో భద్రత కల్పించి, ఖాయమైన హామీలు ఇవ్వడానికి ఇది సమర్థంగా పనిచేస్తుందనే ఆశాభావంతో ఉన్నాం’ అని జెలెన్స్కీ చెప్పారు.

బాంబు దాడులపై నిషేధం
ఇదే సమయంలో రష్యాతో యుద్ధాన్ని ముగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని జెలెన్స్కీ పేర్కొన్నారు. అందుకోసం ట్రంప్ బలమైన నాయకత్వంలో ముందుకు వెళ్లి యుద్ధానికి ముగింపు పలికేందుకు వీలైనంత వేగంగా పని చేస్తామని తెలిపారు. తొలిదశలో ఖైదీల విడుదలతో పాటు, మౌలిక సదుపాయాలపై బాంబు దాడులపై నిషేధం వంటి వాటికి రష్యా అంగీకరిస్తే తదుపరి దశల ద్వారా ముందుకు వెళ్లాలని అనుకుంటున్నామన్నారు. ఇంతకాలం తమకు మద్దతుగా నిలుస్తున్నందుకు అమెరికాకు కృతజ్ఞతలు తెలిపారు.
రష్యాతో శాంతి చర్చలు
అంతకుముందు లండన్లో ఐరోపా దేశాధినేతల సమావేశం అనంతరం మాట్లాడిన జెలెన్స్కీ, అగ్రరాజ్యంతో ఖనిజాల ఒప్పందానికి తాము సిద్ధమేనని అన్నారు. ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్కు అమెరికా మిలిటరీ సాయం నిలిపివేసింది. రష్యాతో శాంతి చర్చలకు కీవ్పై ఒత్తిడి తెచ్చేందుకే అమెరికా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ట్రంప్ తాజా నిర్ణయంతో ఆయుధాలు, ఇతరత్రా యుద్ధసామగ్రి రూపంలో దాదాపు 100 కోట్ల డాలర్ల విలువైనవి ఉక్రెయిన్కు వెళ్లాల్సి ఉండగా అవన్నీ నిలిచిపోయే పరిస్థితి తలెత్తింది. రష్యాతో శాంతి చర్చలు జరిపేందుకు ఉక్రెయిన్ కట్టుబడి ఉందని ట్రంప్ సంతృప్తి చెందేవరకు తమ నుంచి ఆ దేశానికి సాయం అందబోదని శ్వేతసౌధం సీనియర్ అధికారి ఒకరు వెల్లడించినట్లు తెలుస్తోంది.