వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏపీ ఫిలిమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా పని చేసిన ప్రముఖ సినీ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి అరెస్టు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. దీనిపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.పోసాని కృష్ణమురళిని ఏపీ పోలీసులు బుధవారం నాడు హైదరాబాద్లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. గురువారం అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పీఎస్లో జిల్లా ఎస్పీ విద్యాసాగర్ ఆధ్వర్యంలో సుమారు 9 గంటల పాటు విచారించిన పోలీసులు రాత్రి జడ్జి ముందు హాజరుపరిచారు. రాత్రి 9.30 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు సుదీర్ఘంగా వాదనల అనంతరం ఆయనకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ రైల్వే కోడూరు కోర్టు తీర్పునిచ్చింది. దీంతో పోసాని మార్చి 13 వరకు రిమాండ్లో వుంటారు.
వైసీపీ ఆరోపణలు
పోసాని అరెస్టుపై వైసీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. “ఇది రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా కక్ష సాధింపు చర్య,” అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే టీడీపీ నేతలు మాత్రం “ఎవరైనా నేరం చేస్తే శిక్ష అనుభవించాల్సిందే” అంటూ తమ వైఖరిని స్పష్టంగా వెల్లడించారు.
కేసు వివరాలు
తెలుగు దేశం పార్టీ, జనసేన పార్టీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో పోసానిపై ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. జనసేన నేత జోగినేని మణి ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలు తీసుకున్నారు. పోసానిపై ఐపీసీ సెక్షన్లు 196, 353(2), 111 రెడ్ విత్ 3(5) కింద కేసు నమోదు చేశారు.పోలీసుల ప్రకారం, పోసాని కులాల మధ్య చిచ్చుపెట్టేలా వ్యాఖ్యలు చేశారని, సినీ పరిశ్రమకు చెందిన కొన్ని కులాలను కించపరిచేలా మాట్లాడారని పేర్కొన్నారు. ఈ కేసును న్యాయపరంగా పరిశీలించిన అనంతరం బుధవారం రాత్రి హైదరాబాద్లో నాటకీయ పరిణామాల మధ్య ఆయనను అరెస్ట్ చేశారు.
టీడీపీ నేతలు ఇప్పటికే “వల్లభనేని వంశీ అరెస్టు తర్వాత కృష్ణాజిల్లాకు చెందిన మరో ఇద్దరు నేతలను అరెస్టు చేస్తారని” ముందుగా ప్రకటించారు. కానీ అనూహ్యంగా పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేయడం ఒక్కసారిగా రాజకీయ రంగాన్ని వేడెక్కించింది.

వైసీపీ కార్యకర్తలు ఆందోళన
పోసాని అరెస్టును వ్యతిరేకిస్తూ ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ వద్ద వైసీపీ కార్యకర్తలు పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. ప్రభుత్వంపై నినాదాలు చేస్తూ టెన్షన్ వాతావరణం సృష్టించారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా పోసాని అరెస్టుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “దేవుడు అన్నీ చూస్తున్నాడు,” అంటూ ఆయన వ్యాఖ్యానించారు. పోసాని భార్యకు స్వయంగా ఫోన్ చేసి పరామర్శించారని, “మురళికి వైసీపీ అండగా ఉంటుంది,” అంటూ భరోసా ఇచ్చారు.
సబ్ జైలు
ఈ అరెస్టు అనంతరం రాజకీయ దుమారం రేగుతోంది. వైసీపీ శ్రేణులు దీన్ని “పరస్పర కక్షసాధింపు” చర్యగా అభివర్ణిస్తుండగా, టీడీపీ నేతలు “న్యాయస్థానం ముందే విషయాన్ని తేల్చుకోవాలి” అంటూ తమ వాదనను సమర్థించుకుంటున్నారు.
ఇదిలా ఉంటే, పోసాని కృష్ణమురళికి రైల్వే కోడూరు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. తదనంతరం రాజంపేట సబ్ జైలుకి తరలించారు. పోలీసులు ఈరోజు పోసానిని కస్టడీకి తీసుకునే అవకాశం ఉందని సమాచారం.