ఆంధ్రప్రదేశ్ గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వల్లభనేని వంశీ అరెస్టు, రిమాండ్ వ్యవహారం ప్రస్తుత పరిణామాలతో తీవ్ర కలకలం సృష్టిస్తోంది. గతంలో వైసీపీ ప్రభుత్వంలో గన్నవరం టీడీపీ ఆఫీసుపై జరిగిన దాడి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వంశీ, తాజాగా కిడ్నాప్ మరియు బెదిరింపుల ఆరోపణలపై ఏ1గా పోలీసులు కేసు నమోదు చేశారు.ఇప్పటికే ఈ కేసులో అరెస్టు అయిన వంశీ, ప్రస్తుతం రిమాండ్లో జైల్లో ఉన్నాడు. అయితే, బెయిల్ పొందడం ఈ సమయంలో అతనికి చాలా కష్టంగా ఉండబోతోందని భావిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే వంశీపై ఈ కేసులు నమోదవడం, రాజకీయంగా మరింత వేడి పెంచింది, దీనితో ఆయన రాబోయే కాలంలో ఇంకా మరిన్ని కష్టాలు ఎదుర్కొనాల్సి ఉండొచ్చని భావిస్తున్నారు.

గన్నవరం లోని టీడీపీ ఆఫీసుపై గతంలో జరిగిన దాడి కేసులో వల్లభనేని వంశీ ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా పరోక్షంగా ఆయన హస్తం ఉందన్న ఆరోపణలతో పోలీసులు ఏ 71గా చేర్చారు. అయితే ఈ కేసులో ఫిర్యాదు దారుగా ఉన్న సత్యవర్ధన్ ఫిర్యాదుతో ఆయనతో పాటు 87 మంది ఇతర నిందితులపైన అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. అయితే సత్యవర్ధన్ ఉన్నట్లుండి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల కోర్టులో మెజిస్ట్రేట్ ముందు హాజరై తనకూ ఈ వ్యవహారంతో సంబంధం లేదని చెప్పేశారు. దీంతో టీడీపీ ఉలిక్కిపడింది. అక్కడి నుంచి సీన్ మారిపోయింది.వంశీతో పాటు 88 మంది నిందితులుగా ఉన్న గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఫిర్యాదు దారుగా ఉన్న పార్టీ ఆఫీసు కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ ఇలా ఎందుకు యూటర్న్ తీసుకున్నాడని తెలుసుకునేందుకు టీడీపీ ప్రయత్నించింది. ఈ క్రమంలో తన సోదరుడిని వంశీ అనుచరులు బెదిరించి, డబ్బులిచ్చారని తెలుసుకుంది. దీంతో టీడీపీ నేతలు సత్యవర్ధన్ కుటుంబం సాయంతో మరో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా సత్యవర్ధన్ కిడ్నాప్ కు కారకుడిగా వంశీతో పాటు మరో ఇద్దరిని నిన్న పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హాజరుపర్చి రిమాండ్ కు పంపారు. అయితే ఇప్పుడు వంశీ ముందున్న ఏకైక మార్గం బెయిల్ కోరడమే. అయితే ఈ కేసులో ఫిర్యాదు దారుగా ఉన్న సత్యవర్ధన్ నే కిడ్నాప్ చేసి, బెదిరించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న వంశీని బెయిల్ ఇస్తే తిరిగి బెదిరించే అవకాశం ఉందని, సాక్షుల్ని ప్రభావితం చేసే ప్రమాదం ఉందని వాదించేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. దీంతో వంశీకి బెయిల్ లభిస్తుందా లేదా అన్న ఉత్కంఠ పెరుగుతోంది. ప్రస్తుతం విజయవాడ సబ్ జైల్లో ఉన్న వంశీని ఇవాళ మరో కేసులో న్యాయమూర్తి ముందు హాజరు పరచనున్నారు.. అదే సమయంలో వంశీ హైకోర్టును బెయిల్ కోసం ఆశ్రయించే అవకాశముంది.
బెయిల్ పై సందేహాలు
వంశీకి బెయిల్ ఇవ్వడం సాక్షులపై ప్రభావం చూపించి, క్రమశిక్షణను భంగం చేయవచ్చని ప్రభుత్వం వాదన.