అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ సెమీకండక్టర్లే లక్ష్యంగా, దిగుమతులపై మరిన్ని సుంకాలను ప్రకటిస్తారని భావిస్తున్నారు. ఈ చిన్న చిప్స్ లాంటి సెమీ కండక్టర్లు వందల కోట్ల ఎలక్ట్రానిక్ పరికరాలకు ఇంధనంగా పనిచేస్తున్నాయి. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు కీలకంగా మారాయి.
సెమీకండక్టర్లను ఎందుకు ఉపయోగిస్తారు?
సెమీకండక్టర్లను మైక్రోచిప్స్ లేదా ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లుగానూ వ్యవహరిస్తారు. సిలికాన్ వంటి ముడి పదార్థాలతో వీటిని తయారుచేస్తారు. విద్యుత్ నిర్వహణకు, ఎలక్ట్రానిక్ స్విచ్లుగానూ ఉపయోగిస్తారు. అలాగే, కంప్యూటింగ్లో 0,1 రూపంలోని బైనరీ లాంగ్వేజ్కు ఇది అవసరం. స్మార్ట్ఫోన్లు, ల్యాప్ట్యాప్లు, ఎలక్ట్రానిక్ నియంత్రణ వ్యవస్థ ఉండే వాహనాలు, రిమోట్ కార్ కీలు, సెన్సార్ల వంటివాటిలో సెమీకండక్టర్లను ఉపయోగిస్తారు.
మౌలిక సదుపాయాల్లోనూ సెమీకండక్టర్లు భాగం
రూటర్లు, స్విచ్చులు, ఇంటర్నెట్కు కీలకమైన, గ్లోబల్ కనెక్టివీకి వీలు కల్పించే కమ్యూనికేషన్ మౌలిక సదుపాయాల్లోనూ సెమీకండక్టర్లు భాగం. ఎయిర్ టర్బైన్లు, సౌరవిద్యుత్ కేంద్రాల్లో సెమీకండక్టర్లు కనిపిస్తాయి.
ఆరోగ్య రంగంలోనూ సెమీకండక్టర్ల వాడకం ఉంది. వైద్య పరికరాలు, ఇతర సామగ్రి, పేస్మేకర్లు, ఇన్సులిన్ పంపుల వంటి వాటిలో ఉపయోగిస్తారు. సెమీకండక్టర్లను ఎవరు తయారు చేస్తున్నారు?యూకే, అమెరికా, యూరప్, చైనా సెమీకండక్టర్ల కోసం తైవాన్పై ఆధారపడుతున్నాయి. ప్రపంచ సరఫరాలో సగానికిపైగా సెమీకండక్టర్లను తైవాన్ సెమీకండక్టర్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ (టీఎస్ఎంసీ) ఉత్పత్తి చేస్తోంది.
ఎన్విడియా, ఆపిల్, మైక్రోసాఫ్ట్ వంటి టెక్ దిగ్గజాలు ఆ కంపెనీ కస్టమర్లు. ఫలితంగా, అమెరికా, చైనా మధ్య చిప్స్ యుద్దంలో టీఎస్ఎంసీ చిక్కుకుంది. టీఎస్ఎంసీ తర్వాత సెమీ కండక్టర్లర అతిపెద్ద సరఫరా కంపెనీగా దక్షిణ కొరియాకు చెందిన శామ్సంగ్ ఉంది.

సుంకాల ద్వారా ట్రంప్ ఏం కోరుకుంటున్నారు?
రెండో విడత ”ప్రతీకార సుంకాల” ద్వారా అమెరికాలో ఉత్పత్తి పెంచేలా కంపెనీలను ప్రోత్సహించడం ట్రంప్ ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను సుంకాల నుంచి మినహాయిస్తున్నట్టు శుక్రవారం (ఏప్రిల్ 11) వైట్ హౌస్ ప్రకటించింది. ఇది, చైనా దిగుమతులపై విధించిన 125 శాతం సుంకాలకు కూడా వర్తించనుంది. ఈ మినహాయింపుల నిర్ణయం ప్రకటిస్తూనే, సెమీకండక్టర్ల దిగుమతులపై త్వరలో సుంకాలు ప్రకటిస్తామని ట్రంప్ తెలిపారు. ‘మా దేశంలోనే చిప్స్, సెమీ కండక్టర్లు, ఇతర వస్తువులు తయారుచేసుకోవాలని భావిస్తున్నాం’ అని ట్రంప్ అన్నారు. మైక్రో చిప్స్ను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే విషయంలో జాతీయ భద్రత గురించి అధ్యక్షులు, ఆయన పాలనా యంత్రాంగం ఆందోళన వ్యక్తం చేసింది. రానున్న రోజుల్లో దీనిపై విచారణ జరుపుతామని కూడా ప్రకటించింది.
”జాతీయ భద్రత కోణంలో, త్వరలో ప్రకటించనున్న సుంకాల్లో ఎలక్ట్రానిక్స్ సప్లయ్ చైన్, సెమీకండక్టర్లపై దృష్టిపెడతాం” అని తన సోషల్ మీడియా ట్రూత్ సోషల్లో ట్రంప్ పోస్ట్ చేశారు. చైనా వంటి దేశాలు అమెరికాను బందీగా ఉంచలేవని ట్రంప్ అన్నారు.
అమెరికాలో భారీగా ఉత్పత్తి సాధ్యమేనా?
సాంకేతిక ఉత్పత్తుల తయారీని పెంచడం కోసం ఇటీవలి కాలంలో అమెరికా భారీగా వ్యయం చేసింది. టీఎస్ఎంసీ వంటి కొన్ని కంపెనీలు ఇప్పటికే అమెరికాలో తయారీని పెంచాయి. చిప్స్ తయారీని అమెరికాకు తరలించడానికి ద యూఎస్ చిప్స్ యాక్ట్ ప్రోత్సాహకాలు ఇస్తోంది. ఆరిజోనాలో ఫ్యాక్టరీ నిర్మించిన తర్వాత అమెరికా ప్రభుత్వం టీఎస్ఎంసీకి 6.6 బిలియన్ డాలర్ల ప్రోత్సాహకాలు అందించింది.
అయితే, ఫ్యాక్టరీలో నైపుణ్యం ఉన్న ఉద్యోగుల కొరత కారణంగా గతంలో ఉత్పత్తి ఆలస్యమైంది. అమెరికాలో సెమీకండక్టర్ల తయారీని పెంచడానికి ప్రస్తుతం ఇదే అతిపెద్ద సవాలుగా మారింది. తైవాన్ నుంచి వేలమంది కార్మికులను తీసుకెళ్లడం ద్వారా టీఎస్ఎంసీ మాత్రమే ఈ ఉద్యోగుల కొరత సమస్యను పరిష్కరించినట్టు సమాచారం.