ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతిలో కొత్త ఇల్లు కట్టుకోబోతున్నారు.ఈ మేరకు ఏప్రిల్ 9న భూమి పూజ చేయనున్నారు. ఈ ఇల్లు వెలగపూడి రెవెన్యూ పరిధిలో 5 ఎకరాల స్థలంలో నిర్మించనున్నారు.
ఇంటి నిర్మాణం
అమరావతి పునర్నిర్మాణ పనులు త్వరలో ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానుండగా.. చంద్రబాబు ఇంటి నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలని నిర్ణయించారు.చంద్రబాబు నాయుడు గతేడాది ఆఖరులో ఇంటి నిర్మాణం కోసం అమరావతిలో ఈ 5 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ స్థలం ఈ6 రోడ్డుకు దగ్గరగా ఉండగా,గవర్నమెంట్ కాంప్లెక్స్కు 2 కి.మీ దూరంలో ఉంది. ఈ మేరకు ఇంటి నిర్మాణాన్ని వెంటనే మొదలు పెట్టాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఇంటితో పాటు గార్డెన్, భద్రతా సిబ్బంది గదులు, వాహనాల పార్కింగ్ కోసం కూడా స్థలం కేటాయిస్తారు.
కార్యాలయ సిబ్బంది
వీలైనంత త్వరగా ఇంటి నిర్మాణం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. మంత్రి లోకేశ్ కార్యాలయ సిబ్బంది, వాస్తు నిపుణులు శుక్రవారం స్థలాన్ని పరిశీలించారు. ప్రస్తుతం చదును చేసే పనులు జరుగుతున్నాయి. ఈ స్థలాన్ని నెలాఖరులో రిజిస్ట్రేషన్ చేయిస్తారు. ప్లాట్ గుండా వెళ్తున్న విద్యుత్ స్తంభాలను కూడా మారుస్తారు. మొత్తానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అడ్రస్ అమరావతిగా మారనుంది.

పింఛన్ల పంపిణీ
ప్రభుత్వం పింఛన్ల పంపిణీకి వీలుగా ప్రభుత్వం శనివారమే (29వ తేదీన) బ్యాంకుల్లో నగదు జమ చేయనుంది. 30న ఉగాది, 31న రంజాన్, ఏప్రిల్ 1న యాన్యువల్ క్లోజింగ్ డే సందర్భంగా బ్యాంకులకు సెలవు కారణంగా పింఛనుదారులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే నగదు జమ చేయనుంది. ఎలాంటి జాప్యం లేకుండా శనివారమే బ్యాంకుల నుంచి సంబంధిత గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది నగదు విత్ డ్రా చేసుకోవాలని తెలిపింది.
పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు
ఈరోజు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ పాల్గొననున్నారు. పార్టీ పతాకాన్ని చంద్రబాబు ఆవిష్కరిస్తారు. ఎన్టీఆర్ విగ్రహం వద్ద నివాళి అర్పించిన అనంతరం జరిగే సభలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రులు, పొలిట్బ్యూరో సభ్యులు, సీనియర్ నాయకులు పాల్గొంటారు.మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏప్రిల్ 1న బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. చినగంజాం మండలం చిన్న గొల్లపాలెం ఏప్రిల్ 1న లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేయనున్నారు. తొలుత వృద్ధులు, ఒంటరి మహిళ, దివ్యాంగులైన లబ్ధిదారులతో మాట్లాడి, వారికి పింఛన్ పంపిణీ చేస్తారు.పింఛన్ లబ్ధిదారులతో గడుపుతారు. అనంతరం ప్రజావేదిక ద్వారా ప్రజలనుద్దేశించి సభలో సీఎం ప్రసంగిస్తారన్నారు. సభ పూర్తి కాగానే ఒక గంటపాటు పార్టీ కార్యకర్తలతో సమావేశం లో పాల్గొంటారు.అనంతరం జిల్లా అధికారులతోముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారు.