ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే).. మరోసారి గెలుపు ముంగిట బోల్తా కొట్టింది. చిన్నస్వామి వేదికగా చివరి బంతి వరకూ ఉత్కంఠగా సాగిన పోరులో ఆతిథ్య రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) చెన్నైని 2 పరుగుల తేడాతో ఓడించి మళ్లీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకొచ్చింది. బెంగళూరు నిర్దేశించిన 214 పరుగుల ఛేదనలో సీఎస్కే 20 ఓవర్లలో 211/5 వద్దే ఆగిపోయింది. ఆయుష్ మాత్రె (48 బంతుల్లో 94, 9 ఫోర్లు, 5 సిక్సర్లు) వీరవిహారానికి తోడు రవీంద్ర జడేజా (45 బంతుల్లో 77 నాటౌట్, 8 ఫోర్లు, 2 సిక్సర్లు) పోరాడినా ఆఖర్లో తడబడ్డ చెన్నైకి ఓటమి తప్పలేదు. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ విరాట్ కోహ్లీ (33 బంతుల్లో 62, 5 ఫోర్లు, 5 సిక్సర్లు), జాకబ్ బెతెల్ (33 బంతుల్లో 55, 8 ఫోర్లు, 2 సిక్స్లు), రొమారియా షెపర్డ్ (14 బంతుల్లో 53 నాటౌట్, 4 ఫోర్లు, 6 సిక్స్లు) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 213/5 చేసింది.
ఆరంభం
ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన ధోనీ ఈ ఓటమికి తానే కారణమని చెప్పాడు. చివర్లో తాను కొన్ని షాట్స్ ఆడాల్సిందని, తన వైఫల్యం వల్లే ఒత్తిడి పెరిగిందని విచారం వ్యక్తం చేశాడు.’నేను బ్యాటింగ్కు వచ్చినప్పుడు ఉన్న పరిస్థితులు విజయానికి కావాల్సిన పరుగులను చూస్తే నేను కొన్ని భారీ షాట్స్ ఆడి ఉంటే బాగుండేది. ఈ ఓటమికి నేనే బాధ్యుడిని. ఆర్సీబీకి అద్భుతమైన ఆరంభం దక్కింది. అయినా మేం మిడిల్ ఓవర్లలో పుంజుకున్నాం. కానీ రొమారియో షెపర్డ్ అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. బౌలర్లు ఏ బంతులు వేసినా సిక్సర్లు బాదాడు. డెత్ ఓవర్లలో కట్టడిగా బౌలింగ్ చేసేందుకు మేం యార్కర్లు వేయడం ప్రాక్టీస్ చేయాలి. తరుచూ యార్కర్లు వేయాల్సిన అవసరం లేదు. కానీ బ్యాటింగ్కు అనుకూలంగా ఉన్న వికెట్పై పరుగులు కట్టడి చేయాలంటే యార్కర్లే కీలకమవుతాయి. కచ్చితమైన యార్కర్ సాధ్యం కాకపోతే లో-ఫుల్ టాస్ వేయాలి. లో-ఫుల్ టాస్ను భారీ షాట్గా మల్చడం చాలా కష్టం.

ఆడటం
పతీరణ వంటి బౌలర్ యార్కర్లు సాధ్యం కాకపోతే పేస్ను నమ్ముకొని బౌన్సర్లు వేస్తాడు. బ్యాటర్లను ఇబ్బంది పెడుతాడు. కొన్నిసార్లు యార్కర్లు వేసే క్రమంలో లైన్ మిస్సైతే బ్యాటర్లు భారీ షాట్స్ ఆడుతారు. కొందరు బ్యాటర్లు స్కూప్ షాట్స్తో పరుగులు రాబడుతారు. అయితే అందరికీ స్కూప్ షాట్స్ ఆడటం సాధ్యం కాదు. సహజంగా ఈ షాట్ ఆడితే ఏ సమస్య లేదు. అలా కాకుండా ప్రయత్నిస్తే మాత్రం ఎంతటి గొప్ప బ్యాటర్కు అయినా ఇబ్బంది అవుతుంది. ఈ తరంలో అందరూ ఈ స్కూప్ షాట్స్ ఆడటం నేర్చుకోవాలి. మా బ్యాటర్లలో చాలా మంది స్కూప్ షాట్స్ ఆడటం లేదు. జడేజా ఒక్కడే సౌకర్యవంతగా ఈ షాట్ ఆడగలడు.’అని ధోనీ చెప్పుకొచ్చాడు.
Read Also :IPL 2025: సీఎస్కే పై ఆర్సీబీ ఘన విజయం