జమ్ముకశ్మీర్ పహల్గాం ఉగ్రదాడి ఘటనపై దేశవ్యాప్తంగా ప్రజలు ప్రతీకార జ్వాలతో రగిలిపోతున్నారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ ను దెబ్బకు దెబ్బ తీయాలన్న కసితో భారత ప్రభుత్వం ఉంది. సరిహద్దుల్లో పరిస్థితి నివురు గప్పిన నిప్పులా ఉంది. యుద్ధం ఏ క్షణమైనా మొదలయ్యే అవకాశం ఉన్నట్లు నిఘా వర్గాలు వెల్లడిస్తున్నాయి. భారత్ పాకిస్థాన్ సరిహద్దుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టంగా మారింది. అటు ప్రధాని మోదీ ఇటీవల మాట్లాడుతూ ఉగ్రవాదులను మట్టిలో కలిపేస్తామని తేల్చి చెప్పారు. ఇప్పటికే పాకిస్థాన్ పై సంచలన నిర్ణయాలు తీసుకుని ఆ దేశాన్ని అష్టదిగ్భంధనం చేసింది. సింధూ నదీ జలాల ఒప్పందం రద్దు,అధికారులు తగ్గింపు,సార్క్ దేశాల వీసా రద్దు,అటారీ-వాఘా బోర్డర్ మూసివేత, ఎక్స్ర్ సైజ్ ఆక్రమన్.. తదితర చర్యలు చేపట్టి పాకిస్థాన్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.
అయితే తాజాగా పాకిస్థాన్ తో యుద్ధం పై ఇండియన్ ఆర్మీ సంచలన పోస్ట్ పెట్టింది. ఎప్పుడైనా సిద్ధం అంటూ సిగ్నల్ ఇచ్చింది. పాకిస్థాన్ తో ఏ క్షణమైనా యుద్ధం జరగొచ్చు అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్న క్రమంలో భారత ఆర్మీ ఈ పోస్ట్ పెట్టడం సంచలనంగా మారింది. ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటాం అని సైనికులు, జవాన్ల యుద్ధ విన్యాసాలు, పరాక్రమాల దృశ్యాలను షేర్ చేసింది. ఈ మేరకు ఆ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

భారత ఆర్మీ పోస్ట్ ప్రకారం.. ” దేనికీ భయపడం, ఏదీ మిమ్మల్ని ఆపలేదు, ఏ భూభాగం మాకు దూరం కాదు, క్లిష్టమైనది కాదు, ఎప్పుడూ యుద్ధానికి సిద్ధమే’ అని పేర్కొంది. ఇప్పటికే యుద్ధానికి తాము సిద్ధం అంటూ నేవీ అధికారులు కూడా పోస్ట్ పెట్టారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు తూర్పు నావికాదళం సిద్ధంగా ఉందని అధికారులు స్పష్టం చేశారు. ఇక అంతకుముందే పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పహల్గాం ఉగ్రదాడిపై ఆయన స్పందించారు. ఏం జరిగినా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామని అన్నారు. ఉగ్రదాడిపై దర్యాప్తునకు తాము సిద్ధమేనని అన్నారు. ఎలాంటి ముప్పు వచ్చినా ఎదర్కొంటామని తెలిపారు. మరోవైపు శాంతికే తమ ప్రాధాన్యం అని తెలిపారు.
మరోవైపు విశాఖపట్నంలోని నేవీ సన్రైజ్ ఫ్లీట్కు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. తూర్పు నావికాదళాధిపతి వైస్ అడ్మిరల్ ప్రస్తుత పరిస్థితిపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సముద్రమార్గంలో పెరుగుతున్న ఉద్రిక్తతలను దృష్టిలో పెట్టుకొని అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు. దీంతో యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయని నిఘా వర్గాలు భావిస్తున్నాయి.
Read Also: Pahalgam Terror Attack : పహల్గాం ఉగ్ర దాడి.. ఎట్టకేలకు స్పందించిన పాక్ ప్రధాని