అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్న కఠిన విధానాలను రూబియో సమర్థించారు.అమెరికాలో ఉంటున్న విదేశీయులకు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో కీలక హెచ్చరిక చేశారు.అమెరికా సందర్శించడం ఒక హక్కు కాదని, అది ఒక అవకాశం మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు.ఒక ప్రకటనలో, వీసా పొందినంత మాత్రాన ఎవరికీ దేశ బహిష్కరణ నుంచి మినహాయింపు ఉండదని రూబియో తేల్చి చెప్పారు.జాతీయ భద్రత, వలస విధానాల విషయంలో రాజీపడేది లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. ఇటీవల అమెరికాలోని కొన్ని కళాశాలల్లో అంతర్జాతీయ విద్యార్థులు చేసిన ఆందోళనలను ప్రస్తావించారు. కొలంబియా యూనివర్సిటీ విద్యార్థి మహమూద్ ఖలీల్ ఉదంతాన్ని ఆయన ఉదాహరణగా పేర్కొన్నారు. ఇజ్రాయెల్ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్నందుకు ఖలీల్ను దేశం నుంచి పంపించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. అమెరికా చట్టాలను, విలువలను గౌరవించే వారికే ఇక్కడకు వచ్చే అవకాశం ఉంటుందని రూబియో స్పష్టం చేశారు.
నిబంధనలను అతిక్రమిస్తే
వీసా పొందిన తర్వాత కూడా నిఘా ఉంటుందని, పరిస్థితులు మారితే చర్యలు తప్పవని తేల్చి చెప్పారు. చట్టవిరుద్ధంగా పనిచేయడం, ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం వంటి చర్యలను అమెరికా ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని రూబియో తెలిపారు.వీసా నిబంధనలను అతిక్రమించినా, నేరాలకు పాల్పడినా, హమాస్ లేదా హిజ్బుల్లా వంటి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నా వీసాలను రద్దు చేసి, వారిని దేశం నుంచి బహిష్కరించే అవకాశం ఉందని రూబియో హెచ్చరించారు.

ఆందోళన
30 రోజులకు మించి అమెరికాలో ఉండే విదేశీయులందరూ తప్పనిసరిగా తమ పేర్లను నమోదు చేసుకోవాలనే నిబంధనను కూడా ట్రంప్ ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ విధానాల వల్ల ప్రభుత్వ పర్యవేక్షణ ఎక్కువ అవుతుందని విమర్శకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, ప్రజల భద్రత, జాతీయ భద్రత కోసమే ఈ చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం చెబుతోంది. అమెరికా సమాజానికి ఉపయోగపడే వ్యక్తులకే వీసా వ్యవస్థ ఉద్దేశించబడిందని, దేశాన్ని నాశనం చేయాలనుకునే వారిపై కఠిన చర్యలు తప్పవని రూబియో హెచ్చరించారు.
Read Also: Russia: ఉక్రెయిన్పై దాడి 20 మందికి పైగా మృతి