అంతర్జాతీయ పర్యాటకం, వ్యాపార సంబంధాలను ప్రోత్సహించే లక్ష్యంతో చైనా(China) కీలకమైన నిర్ణయం తీసుకుంది. 55 దేశాల పౌరులకు తమ 240 గంటల (10 రోజుల) వీసా రహిత ట్రాన్సిట్ విధానాన్ని విస్తరించినట్లు అధికారికంగా ప్రకటించింది. అంటే 240 గంటల పాటు పాస్పోర్ట్(Passport) ఉంటే వీసా లేకపోయినా ఆ దేశంలో ఉండవచ్చు. ఈ నూతన మార్పులు నేటి నుంచి అంటే జూన్ 12వ తేదీ గురువారం రోజు నుంచే అమల్లోకి రాబోతున్నట్లు వివరించింది. బీజింగ్ ప్రకటించిన ఈ కొత్త పాలసీతో చైనాలో ఆయా దేశాల ప్రజలు స్వల్పకాలిక పర్యటనలను సౌకర్యవంతంగా చేసుకోవచ్చు.

55 దేశాల జాబితాలో ఉన్నవారికి మాత్రమే
చైనా తీసుకు వచ్చిన ఈ 240 గంటల వీసా రహిత ప్రయాణ వెసులుబాటు వల్ల ప్రయాణికులు చైనాలో పర్యాటక కార్యకలాపాలలో పాల్గొనవచ్చు. లేదంటే వ్యాపార సంబంధిత పనులను కూడా నిర్వహించుకోవచ్చు. ఇండోనేషియా, రష్యా, బ్రిటన్ వంటి కీలక దేశాలు ఈ 55 దేశాల జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో 144 గంటల వీసా రహిత ట్రాన్సిట్ విధానం అమలులో ఉండేది. కానీ చైనా ఇప్పుడు దాన్ని 240 గంటలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా అర్హత కల్గిన దేశాల సంఖ్యను కూడా గణనీయంగా పెంచేసింది. ఈ విషయాన్ని షిన్హువా న్యూస్ ఏజెన్సీయే నేరుగా వెల్లడించింది. ఈ దేశాల పౌరులు చైనాలో ప్రత్యేక వీసా లేకుండానే తాత్కాలికంగా ప్రవేశించవచ్చు.
తప్పనిసరి పత్రాలు:
ఈ పథకం చైనాకు వచ్చేవారి వద్ద ధ్రువీకరించిన తేదీలతో ఇతర దేశాలకు వెళ్లే ఇంటర్ లైన్ టికెట్లు, అంతర్జాతీయ ప్రయాణాలకు సంబంధించిన పత్రాలు తప్పనిసరిగా ఉండాలి. అలాగే వీరు దేశంలోని 24 ప్రావిన్సుల్లోని 40 ఓపెన్ పోర్టుల ద్వారా చైనాలో ప్రవేశించవచ్చు. ముఖ్యంగా బీజింగ్, షాంఘై వంటి ప్రాంతాలను సందర్శించవచ్చు. అలాగే పర్యాటక స్థలాల సందర్శన, ఫ్యామిలీ విజిట్స్ వంటివి కూడా చేయొచ్చు. కానీ విద్య, పని, న్యూస్ రిపోర్టింగ్ వంటివి చేయాలంటే మాత్రం సరైన వీసాతో పాటు అధికారుల అనుమతి తప్పనిసరి.
చైనా లక్ష్యం:
చైనా వివిధ దేశాలకు వీసా రహిత ప్రవేశాన్ని కల్పించడం ద్వారా తన ఆర్థిక వ్యవస్థను అబివృద్ధి చేసుకోవడానికి, అంతర్జాతీయ సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. కొవిడ్-19 తర్వాత ప్రపంచ వ్యాప్తంగా పర్యాటక రంగం దెబ్బతిన్న నేపథ్యంలో చైనా ఈ సరికొత్త విధానాన్ని తీసుకువచ్చి పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఈ చర్యతో చైనాలో విదేశీ పెట్టుబడులు, వ్యాపార సమావేశాలు విపరీతంగా పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Read Also: Indian Companies: భారత కంపెనీల ప్రతినిధులు చైనాకు పయనం