తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇప్పటి నుంచి ప్రధాన పార్టీలన్నీ కసరత్తు మొదలు పెట్టారు. అధికార, విపక్షాలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. తాజాగా తమిళగ వెట్రి కజగం అధ్యక్షుడు , సినీ నటుడు విజయ్, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జన సురక్ష పార్టీ ( JSP ) అధినేత ప్రశాంత్ కిషోర్తో సమావేశమైయ్యారు. చెన్నై శివారులోని తన నివాసంలో భేటీ అయ్యారు. దీనిపై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

ప్రాధాన్యత సంతరించుకున్న ఈ ఇద్దరి భేటీ
ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకేతో అనధికార చర్చలు జరుపుతున్న తరుణంలో ఈ ఇద్దరి భేటీ తమిళనాట ప్రాధాన్యత సంతరించుకుంది. విజయ్ నివాసమైన నీలంకరైలో జరిగిన ఈ సమావేశంలో టీవీకె పార్టీ ముఖ్యనేతలు పాల్గొన్నారు. ఈ భేటీలో తమిళనాడు రాజకీయ పరిస్థితులు, జాతీయ పరిణామాలు, 2026లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల వ్యూహంపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక సూచనలు చేసినట్లు సమాచారం.
ఎటువంటి ఒప్పందం జరగలేదు
అయితే టీవీకే తరుపున వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ను నియమించేందుకు ఎటువంటి ఒప్పందం జరగలేదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే విజయ్, తన పార్టీ ఎన్నికల వ్యూహాన్ని రూపొందించేందుకు ప్రత్యేకంగా జాన్ ఆరోకియాసామిని నియమించుకున్నారు. రాజకీయ వ్యూహకర్త ఆధర్ అర్జునాను పార్టీ ప్రధాన కార్యదర్శిగా నిమించి ప్రచార బాధ్యతలనున ఆయను అప్పగించారు. 2023 అక్టోబర్లో నిర్వహించిన రాష్ట్రమహాసభకు ముందే ప్రశాంత్ కిషోర్ను టీవీకే సంప్రదించే ప్రయత్నం చేసింది. అయితే అది వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ఇప్పుడు ఈ ఇద్దరు సమావేశమైయ్యారు. గతంలో డీఎంకే తరుపును ఎన్నికల వ్యూహాకర్తగా ప్రశాంత్ కిషోర్ పనిచేశారు.
ఎన్నికల వ్యూహంకు సిద్ధం
ఇటీవల టీవీకే తమ పార్టీ ఎవరితోనైనా పొత్తుకు సిద్ధమేనని , కానీ విజయ్ నాయకత్వాన్ని ఆమోదించిన పార్టీ మాత్రమే తమతో కలిసి రావచ్చని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్తో విజయ్ భేటీ కావడం.. ఇప్పటి నుంచే ఎన్నికల కోసం పొత్తులు, ఎన్నికల వ్యూహం, ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.