ఛాంపియన్స్ ట్రోఫీ 2025 తొలి సెమీ-ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడుతోన్న భారత జట్టు.. టాస్ ఓడి ముందుగా బౌలింగ్ చేస్తోంది. ఈ క్రమంలో అందరు అనుకున్నట్లే ట్రావిడ్ హెడ్ భారత్కు మరోసారి తలనొప్పిలా తయారయ్యాడు. అయితే భారత్ జట్టుతోపాటు, అభిమానులకు వరుణ్ చక్రవర్తి రూపంలో భారీ ఊరటనిచ్చాడు. వరుణ్ చక్రవర్తి ఆస్ట్రేలియా లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ను అవుట్ చేయడం ద్వారా 1.4 బిలియన్ల మందికి ఉపశమనం కలిగించాడంటూ సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా, టాస్ గెలిచిన తర్వాత, ఆస్ట్రేలియా ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. మొదట్లో పిచ్ను అర్థం చేసుకునేందుకు నెమ్మదిగా ఇన్నింగ్స్ ఆరంభించిన హెడ్.. మూదు ఓవర్ల తర్వాత ఊచకోత షురూ చేశాడు. ఎడమచేతి వాటం ఓపెనర్ స్క్వేర్ లెగ్ మీదుగా ఫ్లిక్ షాట్ ఆడాడు. ఇది భారత అభిమానులను వణుకు పుట్టించేలా చేసింది. 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో భారత బౌలర్లకు ఇచ్చిన ట్రీట్మెంట్ను మరోసారి గుర్తుచేశాడు.
రోహిత్ శర్మ తెలివైన నిర్ణయం
ట్రావిస్ హెడ్ తన దూకుడు బ్యాటింగ్తో మరోసారి భారత జట్టు నుంచి ఆటను దూరం చేస్తాడని అనిపించింది. కానీ, పరిస్థితులు భారత్ పట్టు నుంచి జారిపోతున్న సమయంలో రోహిత్ శర్మ తెలివైన నిర్ణయం తీసుకున్నాడు. స్పిన్నర్లను రంగంలోకి దింపాడు. రోహిత్ శర్మ వరుణ్ చక్రవర్తిని బౌలింగ్ వేసేందుకు ఆహ్వానించాడు. ఈ మార్పు వందలాది మంది ఫ్యాన్స్కు ఎంతో ఊరటనిచ్చింది. తొమ్మిదవ ఓవర్ రెండవ డెలివరీలో, చక్రవర్తి ఆఫ్-స్టంప్ లైన్ ఫుల్ లెన్త్ డెలివరీ వేశాడు.
శుభ్మాన్ గిల్ అద్భుతమైన క్యాచ్
హెడ్ తన పాదాన్ని ముందుకు ఉంచి లాంగ్-ఆఫ్ ఫెన్స్ను దాటించేందుకు ప్రయత్నించాడు. అయితే భారీ షాట్ మిస్సవ్వడంతో, బంతి గాల్లోకి పైకి లేచి లాంగ్-ఆఫ్ ఫీల్డర్ కుడి వైపుకు దూసుకెళ్లింది. శుభ్మాన్ గిల్ పరిగెత్తి వచ్చి అద్భుతమైన క్యాచ్ పట్టాడు. దీంతో ట్రావిస్ హెడ్ పెవిలియన్ చేరాల్సి వచ్చింది. హెడ్ అవుట్ అయిన వెంటనే, రోహిత్ శర్మ ఆనందంగా కనిపించాడు. అలాగే, విరాట్ కోహ్లీ కూడా ట్రావిస్ హెడ్కు ఘాటైన వీడ్కోలు పలికాడు. భారత ఆటగాళ్ల స్పందన భారతదేశానికి వికెట్ ఎంత పెద్దదో సూచిస్తుంది.