ముంబయి ఉగ్రదాడి కుట్రదారుల్లో ఒకరైన తహవ్వుర్ హుస్సేన్ రాణాను భారత్కు అప్పగించడంపై అమెరికా స్పందించింది. 26/11 ఉగ్రవాద దాడులు యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేశాయని వ్యాఖ్యానించింది. ఉగ్రదాడుల బాధ్యులకు తగిన శిక్ష పడేలా భారత్ చేస్తున్న ప్రతి పనికి అమెరికా మద్దతిస్తోందని వెల్లడించింది.
అమెరికా, భారత్ కలిసి పని చేస్తాయి
“భయంకరమైన 2008 ముంబయి ఉగ్రదాడుల్లో తహవ్వుర్ హుస్సేన్ రాణా ప్రమేయంపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో అతడిని భారత్కు అప్పగించాం. ప్రపంచవ్యాప్తంగా పెను సమస్యగా మారిన ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో అమెరికా, భారత్ కలిసి పని చేస్తున్నాయి. ముంబయి ఉగ్రదాడిలో ఆరుగురు అమెరికన్లు సహా 166 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకరమైన దాడులను కొంతమంది గుర్తుంచుకోకపోవచ్చు. కానీ ఈ ఉగ్రదాడి యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది” అని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి టమ్మీ బ్రూస్ వ్యాఖ్యానించారు.

బాధితులకు న్యాయం చేకూర్చే దిశగా అడుగులు
తహవ్వుర్ రాణాను భారత్కు అప్పగించడాన్ని ముంబయి దాడుల బాధితులకు న్యాయం చేకూర్చే దిశగా వేసిన కీలకమైన అడుగుగా యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ప్రతినిధి ఒకరు అభివర్ణించారు. ముంబయి ఉగ్రదాడుల్లో రాణా ప్రమేయంపై విచారణ జరిపేందుకు భారత్కు అతడిని అప్పగించామని పేర్కొన్నారు.
ఈ కేసులో తహవ్వుర్ హుస్సేన్ రాణా తన సహ కుట్రదారు డేవిడ్ కోల్మన్ హెడ్లీకి భారత వీసా పొందడానికి సహాయం చేశాడని ముంబయి పోలీసు అధికారి ఒకరు తెలిపారు. రాణా పదేళ్ల వీసా పొడిగింపు పొందడానికి కూడా సాయపడ్డానని వెల్లడించారు.
సుప్రీంకోర్టులోనూ ఎదురుదెబ్బ
భారత్కు తనను అప్పగించవద్దంటూ అమెరికా సుప్రీంకోర్టులో రాణా వేసిన పిటిషన్ సైతం తిరస్కరణకు గురైంది. దీంతో అతడిని భారత్కు తీసుకొచ్చేందుకు వీలుపడింది. ఈ క్రమంలోనే భారత్కు చెందిన అధికారుల బృందం అగ్రరాజ్యానికి వెళ్లారు.
READ ALSO: Mumbai attack 26/11: ఎట్టకేలకు భారత్కు వచ్చిన తహవ్వుర్ రాణా..ఆ రోజు ఏం జరిగింది?