న్యూఢిల్లీ: ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం ఏడు గంటలకు మొదలైన ఓటింగ్ ప్రక్రియ 6గంటలకు ముగిసింది. సాయంత్రం 5గంటల వరకు 57.70 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. నార్త్-ఈస్ట్ఢిల్లీ నియోజకవర్గంలో అత్యధికంగా 52.73శాతం పోలింగ్ నమోదుకాగా.. న్యూఢిల్లీలో అత్యల్పంగా 43.1శాతం పోలింగ్ రికార్డైంది. మధ్య ఢిల్లీలోని కరోల్ బాగ్ నియోజకవర్గంలో మధ్యాహ్నం 3 గంటల వరకు 39 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల సంఘం తెలిపింది.

ఇక, మరికాసేపట్లో ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి. అయితే ఇటీవల కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చాలా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులు కాగా.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై నిర్వహించిన సర్వేలు ఏం చెబుతాయి అనేది తీవ్ర ఉత్కంఠగా మారింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను అందుకుంటాయా లేక తలకిందులు చేస్తాయా అనేది తీవ్ర చర్చనీయాంశం అవుతోంది.
ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోరు జరుగుతుండగా.. ప్రముఖంగా మాత్రం ఆప్-బీజేపీ హోరాహోరీగా తలపడుతున్నయి. 27 ఏళ్లుగా ఢిల్లీలో అధికారానికి దూరమైన బీజేపీ.. తిరిగి సీఎం కుర్చీని దక్కించుకోవాలని చూస్తుండగా.. ఆప్ హ్యాట్రిక్ కొట్టాలని బలంగా కోరుకుంటోంది. మరోవైపు.. 2013 వరకు 10 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. దీంతో ఈ ఎన్నికల్లో బోణీ కొట్టాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎవరి వైపు మొగ్గు చూపుతాయి అనేది తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి.