ఆంధ్రప్రదేశ్లో జాతీయ రహదారి నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. పల్నాడు జిల్లా నుంచి గుంటూరు, అనంతరం బాపట్ల జిల్లా వరకు 167ఏ నేషనల్ హైవే నిర్మాణం రాష్ట్ర ప్రాజెక్టులలో కీలకంగా మారింది. వాడరేవు నుంచి పిడుగురాళ్ల వరకు నిర్మిస్తున్న ఈ రహదారి మొత్తం రూ. 1,064.24 కోట్లతో నిర్మాణం చేపడుతున్నారు. అధికారులు ఈ హైవే నిర్మాణాన్ని 2025 ఏడాది చివరికి పూర్తి చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నారు.ఈ నేషనల్ హైవే నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నా చాలా మంది రైతులకు ఇంకా నష్టపరిహారం అందలేదని చెబుతున్నారు. నిర్మాణానికి భూములు కోల్పోయి తమకు పరిహారం అందడంలో ఆలస్యం జరుగుతోందంటున్నారు.
భూసేకరణ
ఈ హైవే వాడరేవు నుంచి కారంచేడు, పర్చూరు, చిలకలూరిపేట, నరసరావుపేట మీదుగా పిడుగురాళ్ల దగ్గర నకరికల్లు అడ్డరోడ్డు వరకు నిర్మాణం కొనసాగుతోంది. బాపట్ల జిల్లాలో దాదాపు 45 కిలోమీటర్ల మేర ఈ హైవే ఉండనుంది. ఈ రోడ్డు పూర్తయితే ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి హైదరాబాద్కు త్వరగా వెళ్లొచ్చు. అలాగే తెలంగాణ వైపు నుంచి చీరాల తీర ప్రాంతానికి పర్యాటకులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.ఈ నేషనల్ హైవే కోసం భూసేకరణ చేసినప్పుడు రైతులు తమ భూములను కోల్పోయారు వారికి నష్టపరిహారం ఇస్తామని అధికారులు చెప్పారు. రైతుల నుంచి అన్ని డాక్యుమెంట్లను తీసుకుని ఆన్లైన్లో నమోదు చేశారు. కానీ, రెండేళ్లు గడిచినా కొందరికి మాత్రమే పరిహారం అందగా పరిహారం అందని రైతులు ఆందోళనలో ఉన్నారు. అయినా సరే ఓ వైపు హైవే పనులు జరుగుతుండటంతో తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. రెండేళ్లు అవుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని అధికారులు తమ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

డబ్బులు జమ
రైతుల నష్టపరిహారం అంశంపై అధికారులు స్పందించారు. భూసేకరణ జరగగానే యజమానులకు పరిహారంపై నోటీసులు ఇచ్చామని చెబుతున్నారు. గతంలో పరిహారం ఆలస్యమైందని.. కానీ కొంతకాలంగా రైతుల బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు జమ చేస్తున్నామన్నారు. ఇప్పటికే మూడు దఫాల్లో పరిహారం అందజేశామని కోర్టు వివాదాలు, అగ్రిమెంట్లను పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. త్వరలోనే తప్పకుండా అందరికీ పరిహారం అందేలా చేస్తామంటున్నారు.రైతులకు న్యాయం జరగాలని, వారి కష్టాలను ప్రభుత్వం పట్టించుకోవాలని ప్రజలు కోరుతున్నారు. భూసేకరణ విషయంలో న్యాయమైన పరిహారం,సమయానికి చెల్లింపులు జరిగితే, అభివృద్ధి పట్ల నమ్మకం మరింత పెరిగి, ప్రజల భాగస్వామ్యం కూడా మరింత పెరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Read Also: Social Media : సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్