జమ్మూ కశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లా పహల్గామ్ ఉగ్రదాడితో భారత్, పాకిస్థాన్ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల వేళ కశ్మీర్ సమస్యపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాలు 1,000 లేదా 1,500 సంవత్సరాలుగా కశ్మీర్ కోసం కొట్టుకుంటున్నాయని వ్యాఖ్యానించారు. దీంతో ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియల కోసం వాటికన్కు వెళ్లే ముందు ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ. భారత్, పాక్ సంబంధాల గురించి ఆయన స్పందించారు. భారత్తోనూ, పాకిస్థాన్తోనూ తనకు మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. కశ్మీర్ సమస్యకు రెండు దేశాలు ఏదో ఒక పరిష్కారం కనుగొంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటీవల జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి చాలా బాధాకరమని ఆయన అన్నారు.
ప్రయత్నం
ట్రంప్ వ్యాఖ్యలపై నెటిజన్లు స్పందిస్తూ ‘ఆయన చాలా ఇబ్బందికరంగా మాట్లాడుతున్నారు’ అని ‘కశ్మీర్ వివాదం గురించి ఆయనకే బాగా తెలుసు’ పలువురు వ్యంగ్యంగా కామెంట్లు పెడుతున్నారు.పహల్గామ్ ఉగ్రదాడి కొందరు విశ్లేషకులు ఆయన వ్యాఖ్యలను నేరుగా అమెరికా జోక్యం లేకుండానే భారత్, పాకిస్థాన్లు కశ్మీర్ సమస్య పరిష్కారానికి ప్రోత్సాహం ఇచ్చే ప్రయత్నంగా చూస్తున్నారు.గతంలో కశ్మీర్ వివాదంపై తాను మధ్యవర్తిత్వం వహించడానికి తాను సిద్ధంగా ఉన్నట్టు ట్రంప్ ఇచ్చిన ఆఫర్ను భారత్ తిరస్కరించింది. ఇది తమ అంతర్గత వ్యవహారమని, ఇందులో ఎవరి జోక్యం అవసరం లేదని తేల్చిచెప్పింది.

కశ్మీర్ వివాదం
కశ్మీర్ అంశాన్ని 1000-1,500 ఏళ్ల నాటి సంఘర్షణగా, ట్రంప్ మాటలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకంటే, భారత్, పాకిస్థాన్లు అనే ఆధునిక దేశాలు 1947లో బ్రిటిష్ వలస పాలన ముగిసిన తర్వాత మాత్రమే ఏర్పడ్డాయి. దేశ విభజన జరిగి 75 ఏళ్లు అయ్యింది. ఆ సమయంలోనే కశ్మీర్ వివాదం మొదలైంది. ఈ లెక్కన కశ్మీర్ సమస్య మొదలై 75 ఏళ్లు అవుతుంది. మరి ట్రంప్ ఏ ప్రాతిపదిక 1000-1,500 ఏళ్లు అంటున్నారు. ఆయన చెప్పినట్టే కశ్మీర్ సమస్య 1,500 ఏళ్లుగా ఉందని అనుకుందాం, మరి భారత్లోకి అరబ్బులు అడుగుపెట్టిందే క్రీ.శ 712లో. అంటే, అప్పుడే కశ్మీర్ వివాదం మొదలైందా? ఆయన ఏ ఆధారాలతో ఈ వ్యాఖ్యలు చేశారో? ట్రంప్కే తెలుసు.భారత ఉప-ఖండంలో 1947లో బ్రిటిష్ వలస పాలన ముగిసింది. పోతూపోతూ బ్రిటిషర్లు దేశాన్ని రెండు ముక్కలుగా చేశారు. భారత్, పాకిస్థాన్ అనే రెండు స్వతంత్ర దేశాలు ఏర్పడ్డాయి. స్వాతంత్య్రం వచ్చేనాటికి దేశంలోని 562 సంస్థానాలు ఉండేవి. స్వాతంత్య్రం సమయంలో ఈ సంస్థానాలకు మూడు ఎంపికలు ఇచ్చారు: 1. భారతదేశంతో కలవడం. 2. పాకిస్తాన్తో కలవడం. 3. స్వతంత్రంగా ఉండటం. అయితే, కేవలం మూడు సంస్థానాలు తప్పా మిగతావి బేషరుతుగా భారత యూనియన్లో విలీనమయ్యాయి. నాటి హోం మంత్రి సర్దార్ వల్లభభాయ్ పటేల్ ఈ సంస్థానాలను భారత యూనియన్లో విలీనం చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన, ఆయన సెక్రటరీ వి.పి. మీనన్ కలిసి సంస్థానాధిపతులను ఒప్పించి, చాలా వరకు చర్చల ద్వారా విలీనం జరిగింది.
Read Also: Narendra Modi: పహల్గామ్ దాడిపై పిఎమ్ సంచలన వ్యాఖ్యలు