తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి ఇటీవల జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలను తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూచనల ప్రకారం భక్తుల సంక్షేమాన్ని, ఆలయ పరిరక్షణను, భూముల రక్షణను దృష్టిలో పెట్టుకుని పలు నిర్ణయాలను ఆమోదించింది. మొత్తం రూ.5,058 కోట్ల రూపాయల వార్షిక బడ్జెట్కు కూడా ఆమోద ముద్ర వేసింది.

భక్తుల కోసం తీసుకున్న కీలక నిర్ణయాలు:
వృద్ధులు, దివ్యాంగ భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని వారికి ఆఫ్లైన్లో దర్శన టికెట్లు కేటాయించే పద్ధతిని మళ్లీ ప్రారంభించేందుకు టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత సౌకర్యంగా ఉండేలా ఈ విధానాన్ని సమీక్షించి త్వరలోనే కొత్త మార్గదర్శకాలను ప్రకటించనుంది. టీటీడీ పర్మినెంట్ ఉద్యోగులకు ప్రత్యేకంగా మూడు నెలలకు ఒకసారి ‘సుపథం దర్శనం’ అందించనుంది. ఇది ఉద్యోగులకు స్వామివారి దర్శనం కల్పించే మరొక ప్రత్యేక అవకాశంగా మారనుంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని VIP దర్శన వేళల్లో మార్పులు చేయాలని టీటీడీ నిర్ణయించింది. భక్తులకు సాధారణ దర్శనాన్ని మరింత వేగంగా అందించేందుకు ఈ మార్పు చేయనున్నారు.
టీటీడీ ఆస్తుల పరిరక్షణకు కఠిన నిర్ణయాలు
శ్రీవారి ఆలయానికి సంబంధించిన భూములు, ఆస్తులు ఇతరుల చేతిలోకి వెళ్లకుండా ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ఆలయ ఆస్తులపై ఉన్న వివాదాలను త్వరగా పరిష్కరించి వాటిని భక్తుల సేవలోకి తీసుకురావడానికి న్యాయపరమైన చర్యలు వేగంగా తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. టీటీడీలో విధులు నిర్వహిస్తున్న హిందూయేతర ఉద్యోగులను వారి హోదాకు తగిన విధంగా బదిలీ చేయడం లేదా వీఆర్ఎస్ (వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్) ద్వారా తొలగించడం జరుగుతుంది. భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. తిరుమల పరిసరాల్లో ఏడు కొండలకు ఆనుకుని వ్యాపార కార్యకలాపాలకు అనుమతి ఇవ్వకూడదనే నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే వ్యాపారం నిర్వహిస్తున్న ప్రభుత్వ విభాగాలకు ప్రత్యామ్నాయ భూములు కేటాయించేందుకు ప్రణాళిక రూపొందించనున్నారు. గత ప్రభుత్వ హయాంలో ముంతాజ్ హోటల్కు ఇచ్చిన భూమిని రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో అలాంటి కేటాయింపులు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. తిరుపతిలో సైన్స్ సిటీ కోసం కేటాయించిన భూములు వాడకంలోకి రాలేదు కాబట్టి వాటిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించారు.
టీటీడీ ఆలయాల నిర్మాణ ప్రణాళిక
దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల్లో శ్రీవారి ఆలయాలను నిర్మించాలని టీటీడీ నిర్ణయించింది. ఇప్పటికే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు భూముల కేటాయింపు కోసం లేఖలు పంపించింది. భూమి లభించగానే ఆలయాల నిర్మాణ ప్రక్రియ వేగంగా ప్రారంభించనుంది. ఆర్థిక స్థోమత లేక నిర్మాణంలో నిలిచిపోయిన ఆలయాలను పునరుద్ధరించేందుకు శ్రీవాణి ట్రస్టు నిధుల నుంచి సహాయం అందించాలని నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా శిధిలమైన ఆలయాలను పునరుద్ధరించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించనున్నారు. అమరావతిలో జరిగిన శ్రీవారి కళ్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించిన టీటీడీ. దీన్ని రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. టీటీడీ తీసుకున్న ఈ కీలక నిర్ణయాలు భక్తులకు మరింత సేవలు అందించడమే కాకుండా, ఆలయ ఆస్తుల పరిరక్షణ, ధార్మిక చట్టాల్లో మార్పులు, హిందూ మత పరిరక్షణకు దోహదపడతాయి. టీటీడీ పర్మినెంట్ ఉద్యోగులకు మూడు నెలలకు ఒకసారి సుపథం దర్శనం కల్పించడంతో పాటు వీఐపీ దర్శన వేళలను మారుస్తామని చెప్పారు టీటీడీ చైర్మన్ బీఆర్నాయుడు.