తిరుమలలో భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో వసతి సమస్యలు తీవ్రంగా మారాయి. అయితే, భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కొత్త కార్యాచరణను సిద్ధం చేసింది. భక్తులకు అధునాతన వసతి సౌకర్యాలను అందించేందుకు టీటీడీ ఇప్పటికే వివిధ మార్గాలను పరిశీలిస్తూ ఉంది. ఈ క్రమంలో పాత భవనాల నిర్వహణ, కొత్త భవనాల నిర్మాణం, గదుల కేటాయింపు విధానంలో మార్పులు తీసుకురావడం వంటి కీలక నిర్ణయాలను టీటీడీ అమలు చేయనుంది.

పాత భవనాల పరిస్థితి – కొత్త భవనాల నిర్మాణం
తిరుమలలో ఇప్పటికే ఉన్న భవనాల స్థితిగతులను టీటీడీ సమీక్షిస్తోంది. కొన్ని భవనాలు శిథిలావస్థకు చేరడంతో వాటిని తొలగించి కొత్త భవనాల నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకుంటోంది. తిరుపతిలోనూ రెండు కొత్త భవనాల నిర్మాణంపై గతంలో నిర్ణయం తీసుకున్నారు. తిరుమలలోని సుదర్శన్ అతిథి గృహం, గోవర్ధన్, కల్యాణ్ సత్రం వంటి ప్రాంతాల్లో వసతి గదుల్లో నీరు లీకేజీలు, పెచ్చులు ఊడటం వంటి సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. ఈ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టారు. అంతేకాకుండా, తిరుమలలోని శ్రీ పద్మావతి అతిథిగృహం, శ్రీ వేంకటేశ్వర అతిథిగృహం, రామ్ బగీచా, వరాహస్వామి భవనం, ట్రావెలర్స్ బంగ్లా, నారాయణగిరి గెస్ట్ హౌస్, నందకం, పాంచజన్యం, కౌస్తుభం, వకుళ మాత, సప్తగిరి వసతి గృహాలను మరమ్మతులు చేసి భక్తులకు అందుబాటులోకి తెస్తున్నారు. ఇకపోతే, తిరుపతిలో గోవింద రాజుల సత్రంలో 540 గదులు కొత్తగా నిర్మాణంలో ఉన్నాయి. ఈ నిర్మాణాల ద్వారా భక్తులకు వసతి కష్టాలు తొలగే అవకాశం ఉంది.
గదుల కేటాయింపు విధానంలో కీలక మార్పులు
తిరుమలలో రోజూ వేలాదిమంది భక్తులు వచ్చి పోతుంటారు. ప్రస్తుతం తిరుమలలో 7,500 గదులు అందుబాటులో ఉన్నాయి. అయితే, వీటి కేటాయింపు విధానంలో కీలక మార్పులను టీటీడీ తీసుకువచ్చింది. సామాన్య భక్తులకు కేటాయింపు 3,500 గదులు కరెంట్ బుకింగ్ ద్వారా ఆధార్ కార్డు ఆధారంగా భక్తులకు కేటాయించనున్నారు. 1,580 గదులను అడ్వాన్స్ బుకింగ్ విధానం ద్వారా భక్తులకు అందించనున్నారు. వీఐపీ భక్తులకు కొత్త నిబంధనలు ఇప్పుడు నుంచి వీఐపీ భక్తులకు వసతి గదులు కేటాయించేందుకు శ్రీవారి దర్శనం టికెట్ తప్పనిసరి చేశారు. ఆధార్ కార్డుతో పాటు దర్శనం టికెట్ను చూపిస్తే మాత్రమే పద్మావతి విచారణ కేంద్రం, ఎంబీసీ, టీబీ కౌంటర్లలో గదులు పొందే అవకాశం ఉంటుంది. విరాళదాతలకు ప్రత్యేక గదులు టీటీడీ విరాళదాతల కోసం 400 గదులను ప్రత్యేకంగా కేటాయించింది. మరో 450 గదులను టీటీడీ అరైవల్ కోటాలో అందుబాటులో ఉంచింది.