అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి, వాణిజ్య యుద్ధం అనే పదం ప్రపంచవ్యాప్తంగా మరింత ప్రాచుర్యం పొందింది. అమెరికా తమ ఎగుమతులపై అధిక పన్నులు విధించే దేశాలకు నేరుగా హెచ్చరికలు జారీ చేస్తోంది. భారత్, చైనా, యూరోపియన్ యూనియన్, కెనడా వంటి దేశాలకు ట్రంప్ ఇప్పటికే తేల్చిచెప్పినట్లు కనిపిస్తోంది.

ట్రంప్ విధానాలు & భారత ఎగుమతులపై ప్రభావం
ట్రంప్ ప్రకారం, ఇతర దేశాలు అమెరికా ఉత్పత్తులపై అధిక పన్ను విధిస్తే, అదే స్థాయిలో అమెరికా కూడా ప్రతిస్పందిస్తుందని స్పష్టం చేశారు. భారతీయ ఉత్పత్తులపై ట్రంప్ ప్రభుత్వం కొత్త సుంకాలు విధించడం, భారత ఎగుమతిదారులను ఆందోళనలోకి నెడుతోంది. 87% భారత ఎగుమతులు అమెరికా కొత్త పన్నుల విధానానికి గురయ్యే అవకాశముంది, వీటి విలువ దాదాపు $66 బిలియన్ డాలర్లు ఉంటుందని విశ్లేషకుల అంచనా. ట్రంప్ విధానాల నేపథ్యంలో, భారత ప్రభుత్వం కూడా వ్యూహాత్మకంగా స్పందిస్తోంది. భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాన్ని సమీక్షించే ప్రక్రియ ప్రారంభమైంది. అమెరికా నుండి దిగుమతయ్యే 23 బిలియన్ డాలర్ల ఉత్పత్తులపై పన్ను తగ్గించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ప్రస్తుతం 5% – 30% మధ్య పన్ను విధించబడుతున్న 55% అమెరికా దిగుమతులపై భారత్ సుంకాలు తగ్గించేందుకు ప్రయత్నిస్తోంది కొన్ని వస్తువులపై పూర్తిగా పన్ను ఎత్తివేసే అవకాశం కూడా ఉంది.
భారత్-అమెరికా మధ్య చర్చలు
రెండు దేశాల మధ్య తీవ్ర స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. భారత ఎగుమతులకు అధిక పన్నులు విధిస్తే, అమెరికా దిగుమతులపై కూడా భారత్ వ్యతిరేక చర్యలు తీసుకునే అవకాశముంది. వాణిజ్య సంబంధాలను మెరుగుపర్చేందుకు పన్నుల తగ్గింపు, ఇరు దేశాల మధ్య సమతుల్యత కోరుతున్న కేంద్ర ప్రభుత్వం, త్వరలో ఒక కీలక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. భారత్, అమెరికా మధ్య తలెత్తిన ఈ పరిస్థితి గ్లోబల్ మార్కెట్లను ప్రభావితం చేసే అవకాశం ఉంది. భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం మారిపోతే, ఇతర దేశాలపై కూడా దీని ప్రభావం పడొచ్చు. భారత్ దిగుమతులపై పన్ను తగ్గించుకుంటే, దేశీయ పరిశ్రమలపై కూడా దీని ప్రభావం ఉండొచ్చు. వీటిలో కొన్ని సుంకాలను గణనీయంగా తగ్గించవచ్చని, మరికొన్నింటిని పూర్తిగా తొలగించవచ్చని తెలుస్తోంది. ఈ ప్రతిపాదన ఇంకా చర్చలో ఉందని, దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.