జమ్ము కశ్మీర్లోని రాజౌరీ జిల్లాలోని బుధాల్ గ్రామంలో అంతుచిక్కని మరణాలు సంభవిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే నెలన్నర రోజుల వ్యవధిలోనే మొత్తంగా 17 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ మరణాలకు కారణం ఏంటో తెలుసుకునేందుకు అటు రాష్ట్ర ఆరోగ్యశాఖతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టింది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి కారణాలను కనుక్కోలేకపోయింది. అయితే తాజాగా దీనిపై కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ స్పందించారు. రాజౌరీ మిస్టరీ మరణాల వెనుక ఉన్న అసలు కారణాన్ని వెల్లడించారు. రాజౌరీ జిల్లాలోని బుధాల్ గ్రామంలో గతేడాది డిసెంబర్ నెల 7వ తేదీన ఓ కుటుంబం సహపంక్తి భోజనాలు చేసింది. అయితే తిన్న వెంటనే ఏడుగురు అస్వస్థతకు గురయ్యారు. విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు వారిని ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఇది జరిగిన మరో 5 రోజులకే రెండో సంఘటన చోటు చేసుకుంది. డిసెంబర్ 12వ తేదీ రోజు మరో కుటుంబం సహపంక్తి భోజనాలు చేయగా.. తొమ్మిది మంది అస్వస్థతకు గురయ్యారు. అందులో ముగ్గురు చనిపోగా.. ఆరుగురు చికిత్స పొందుతున్నారు.

ఈ ఘటన జరిగిన మరో నెల రోజులకు అంటే జనవరి 12వ తేదీన మరో కుటుంబంలోనూ ఇలాంటిదే జరిగింది. సహపంక్తి భోజనం చేయగా.. మొత్తం పది మంత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇందులో ఆరుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఇలా 45 రోజుల వ్యవధిలోనే మొత్తంగా 17 మంది ప్రాణాలు కోల్పోయారు. వీటన్నిటినీ గుర్తించిన రాష్ట్ర సర్కారు రంగంలోకి దిగి.. బాధితుల నుంచి నమూనాలను సేకరించి దేశంలోని అనేక ల్యాబ్లకు పంపించింది. అలాగే బాధితుల్లో కొన్ని విషపూరిత పదార్థాలను గుర్తించామన్నారు. అయితే ఎవరైనా కావాలనే ఈ మూడు కుటుంబాలు తిన్న ఆహార పదార్థాల్లో విషం కలిపి ఉంటే తామస్సలే ఊరుకోమని.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.