ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో షాదారా నియోజకవర్గం ఈసారి రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఏకంగా 32 ఏళ్ల తర్వాత భారతీయ జనతా పార్టీ (బీజేపీ) విజయం సాధించగలిగింది. ఈ విజయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషించారు.
ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి సంజయ్ గోయల్ 5,000 ఓట్ల తేడాతో గెలిచారు. షాదారాలో బీజేపీ చివరిసారిగా 1993లో గెలిచింది. ఆ తర్వాత కాంగ్రెస్ (1998, 2003, 2008), శిరోమణి అకాలీదళ్ (2013), ఆమ్ ఆద్మీ పార్టీ (2015, 2020) వరుస విజయాలు సాధించాయి.
ఈసారి ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు స్వయంగా పాల్గొన్నారు. ఫిబ్రవరి 2న షాదారాలో బీజేపీ అభ్యర్థికి మద్దతుగా ఆయన చేసిన ప్రచారం కీలకంగా మారింది. ఫలితంగా, మూడు దశాబ్దాల విరామం తర్వాత బీజేపీ ఈ నియోజకవర్గంలో విజయం సాధించి, భారీ పునరాగమనాన్ని అందుకుంది. బీజేపీ శ్రేణులు ఈ విజయాన్ని ఘనంగా జరుపుకుంటున్నాయి.
బీజేపీ నాయకత్వం చంద్రబాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. ఆయన రాజకీయ అనుభవం, ప్రాభవం ఉత్తర భారతదేశంలో కూడా ప్రభావం చూపిందని నేతలు అభిప్రాయపడ్డారు. ఈ విజయం భవిష్యత్తులో బీజేపీ-టిడిపి మధ్య బంధాన్ని మరింత బలపరచనుందని విశ్లేషకులు చెబుతున్నారు.