అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలో.. భారతదేశంతో వాణిజ్య ఒప్పందాన్ని ప్రకటించిన అనంతరం, భారతదేశం రష్యా నుంచి ముడి చమురు దిగుమతులను నిలిపివేసిందని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం ఈ వ్యాఖ్యలపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది. దీనిపై తాజాగా విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి(Vikram Misri) స్పందించారు. భారతదేశ ఇంధన విధానం పూర్తిగా జాతీయ ప్రయోజనాల ఆధారంగానే కొనసాగుతుందని స్పష్టం చేశారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) నిర్వహించిన ప్రత్యేక మీడియా బ్రీఫింగ్లో మాట్లాడిన మిస్రి.. చమురు, ఇంధన రంగంలో తీసుకునే నిర్ణయాలు రాజకీయ ఒత్తిళ్ల వల్ల కాకుండా, వాస్తవ మార్కెట్ పరిస్థితులు దేశ అవసరాల ఆధారంగా ఉంటాయని తెలిపారు. ప్రభుత్వం అయినా, ప్రైవేట్ సంస్థలైనా.. అందరూ జాతీయ ప్రయోజనాలే దిశానిర్దేశం చేస్తాయని ఆయన స్పష్టం చేశారు. ప్రత్యేకంగా రష్యా నుంచి చమురు దిగుమతుల విషయానికి వస్తే.. ఇది ప్రభుత్వ ఆదేశాల ద్వారా కాకుండా, చమురు కంపెనీలు తీసుకునే వ్యాపార నిర్ణయమని మిస్రి వివరించారు.
Read Also: Trade Deal: భారత్–అమెరికా ఒప్పందంతో ముంచుకొస్తున్న ప్రమాదాలు ఇవే..

భారత్కు ఇంధన భద్రత అత్యంత కీలకం
ఈ నిర్ణయాలు తీసుకునేటప్పుడు లభ్యత, ధరలు, సరఫరా భద్రత, ప్రమాద అంచనా, లాజిస్టిక్స్ వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంటారని తెలిపారు. ఆయిల్ మార్కెట్ చాలా క్లిష్టమైనదని, ఒకే దేశంపై ఆధారపడకుండా వివిధ వనరుల నుంచి సరఫరా పొందడం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. భారతదేశం చమురు, గ్యాస్ రంగంలో నికర దిగుమతిదారైన దేశం అని గుర్తుచేసిన మిస్రి.. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ ఇంధన ధరల పెరుగుదల వల్ల ద్రవ్యోల్బణంపై పడే ప్రభావాన్ని గమనిస్తూ ముందుకెళ్తుందని చెప్పారు. అందుకే ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం భారతీయ వినియోగదారుల ప్రయోజనాలను కాపాడే విధంగానే ఉంటుందని స్పష్టం చేశారు. ఈ రంగంలో మీరు చూస్తున్నది పూర్తిగా వ్యాపారపరమైన ఎంపికలే. అవి ప్రభుత్వ నిర్ణయాలు కావచ్చు లేదా వ్యాపార సంస్థల నిర్ణయాలు కావచ్చు. కానీ అవన్నీ జాతీయ ప్రయోజనాల చుట్టూనే తిరుగుతాయని మిస్రి వ్యాఖ్యానించారు. భారత్కు ఇంధన భద్రత అత్యంత కీలకమని.. సరసమైన ధరల్లో నిరంతర సరఫరా ఉండేలా చూడటం ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: