हिन्दी | Epaper

Digital currency: భారత్ నిర్ణయానికి జై కొడుతున్న బ్రిక్స్ దేశాలు

Vanipushpa
Digital currency: భారత్ నిర్ణయానికి జై కొడుతున్న బ్రిక్స్ దేశాలు

భారతదేశ సరిహద్దు వాణిజ్యం, ఆర్థిక లావాదేవీలు, పర్యాటకానికి సంబంధించిన చెల్లింపులను మరింత వేగంగా, తక్కువ ఖర్చుతో నిర్వహించేందుకు BRICS (BRICS) దేశాల అధికారిక డిజిటల్ కరెన్సీలను (CBDCs) పరస్పరం అనుసంధానించాలనే కీలక ప్రతిపాదనను భారత కేంద్ర బ్యాంక్ – రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ముందుకు తెచ్చింది. ఈ విషయం గురించి తెలిసిన రెండు అధికారిక వర్గాలు ఈ సమాచారాన్ని వెల్లడించాయని రాయిటర్స్ నివేదిక పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్య సంక్షోభాల నేపథ్యంలో ఈ చర్య క్రమంగా అమెరికా డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ప్రతిపాదనను 2026 BRICS శిఖరాగ్ర సమావేశం ఎజెండాలో చేర్చాలని RBI సూచించింది. ఈ సమావేశానికి ఈ ఏడాది చివర్లో భారతదేశం ఆతిథ్యం ఇవ్వనుంది.

Read Also: Andhra Pradesh: ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు

Digital currency: భారత్ నిర్ణయానికి జై కొడుతున్న బ్రిక్స్ దేశాలు
Digital currency: భారత్ నిర్ణయానికి జై కొడుతున్న బ్రిక్స్ దేశాలు

ప్రస్తుతం BRICS కూటమిలో వున్న దేశాలు

ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే BRICS దేశాల మధ్య వారి సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీలను నేరుగా అనుసంధానించేందుకు చేసే తొలి అధికారిక ప్రయత్నం ఇదే అవుతుంది. ఈ విషయంపై బహిరంగంగా మాట్లాడే అధికారం లేకపోవడంతో సంబంధిత వర్గాలు పేరు చెప్పడానికి ఇష్టపడలేదని రాయిటర్స్ తెలిపింది. ప్రస్తుతం BRICS కూటమిలో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికాతో పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇరాన్, ఇండోనేషియా వంటి కొత్త సభ్యదేశాలు కూడా ఉన్నాయి. ఈ కూటమి చర్యలు అమెరికా దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్పటికే BRICS‌ను అమెరికా వ్యతిరేక కూటమిగా విమర్శిస్తున్నారు. డాలర్ ఆధిపత్యాన్ని బలహీనపరిచే చర్యలు చేపడితే సుంకాలు విధిస్తామని హెచ్చరికలు చేస్తున్నారు.

అంతర్జాతీయంగా రూపాయి వినియోగం పెరుగుతుంది

అయితే ఈ వ్యాఖ్యలపై రాయిటర్స్.. RBI, భారత ఆర్థిక మంత్రిత్వ శాఖను సంప్రదించగా వారు స్పందించలేదు. అలాగే బ్రెజిల్, రష్యా కేంద్ర బ్యాంకులు కూడా స్పందించలేదు. చైనా కేంద్ర బ్యాంకు తమ వద్ద పంచుకునే సమాచారం లేదని తెలిపింది, దక్షిణాఫ్రికా వ్యాఖ్యానించడానికి నిరాకరించింది. ముఖ్యంగా వాణిజ్యం, పర్యాటక చెల్లింపుల కోసం BRICS CBDCల అనుసంధానం ప్రతిపాదన గతంలో ఎక్కడా వెల్లడికాలేదు. 2025లో రియో డి జనీరోలో జరిగిన BRICS శిఖరాగ్ర సమావేశంలో.. సభ్య దేశాలు సరిహద్దు లావాదేవీలను వేగవంతం చేయడానికి, ఖర్చులు తగ్గించడానికి చెల్లింపు వ్యవస్థల మధ్య పరస్పర అనుసంధానం అవసరం అని ప్రకటించాయి. దీనినే ఆధారంగా తీసుకొని ఈ ప్రతిపాదన ముందుకు వచ్చినట్లుగా తెలుస్తోంది. భారత డిజిటల్ రూపాయిని ఇతర దేశాల CBDCలతో అనుసంధానించడం ద్వారా సరిహద్దు సెటిల్‌మెంట్ సామర్థ్యం మెరుగవుతుందని, అలాగే రూపాయి అంతర్జాతీయ వినియోగం పెరుగుతుందని RBI భావిస్తోంది. అయితే, ఈ ప్రయత్నాలు డీ-డాలరైజేషన్‌ను లక్ష్యంగా చేసుకున్నవి కావని RBI స్పష్టం చేసింది. ప్రస్తుతం BRICS దేశాల్లో ఏదీ పూర్తిగా రిటైల్ CBDCని ప్రవేశపెట్టలేదు. అయితే ఐదు దేశాలు పైలట్ ప్రాజెక్టులను అమలు చేస్తున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870