తిరుమల కొండలపై విమానాలు, డ్రోన్ల మోజు భక్తులలో కలవరము!
ఈ మధ్యకాలంలో తిరుమల శ్రీవారి కొండలపై విమానాలు తరచూ కనిపించడం సర్వ సాధారణ విషయంగా మారిపోయింది. ప్రత్యేకించి శ్రీవారి ఆలయం సమీపంలోనే విమానాల రాకపోకలు సాగుతుండటంతో భక్తుల దృష్టిని ఆకర్షించడమే కాకుండా, భద్రతాపరంగా గంభీరమైన సందేహాలు కలుగజేస్తున్నాయి. ఆనంద నిలయం పైనే ఎయిర్ క్రాఫ్ట్ ప్రయాణించటం వంటి ఘటనలు భక్తుల మనసుల్లో కలకలం రేపుతున్నాయి. ఇది సాధారణంగా కనిపించకపోయినా, ఇటీవల తరచూ ఇలా జరగటం వల్ల భక్తులు, అధికారులు, ఆగమ శాస్త్ర నిపుణులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విమానాలు కాకుండా, ఇప్పుడిక డ్రోన్ల వినియోగం కూడా తిరుమల ఆకాశాన్ని తాకుతోంది. ఇది భక్తుల గోప్యతకు, ఆలయ భద్రతకు సవాలుగా మారుతోంది.
ఆగమశాస్త్ర పరంగా విమానాల అనుమతి లేనిదే..?
తిరుమల శ్రీవారి ఆలయం ప్రాచీన ఆగమ శాస్త్రాలకు అనుగుణంగా నిర్మించబడిన పవిత్ర క్షేత్రం. ఆగమశాస్త్ర ప్రకారం, దేవాలయాలపై విమానాలు ఎగరడం అనేది నిషిద్ధం. ఇది ఆధ్యాత్మిక ఉల్లంఘనగా మాత్రమే కాకుండా, దేవతామూర్తులపై విఘ్నంగా భావించబడుతుంది. తిరుమల వంటి అత్యంత పవిత్రమైన దేవస్థలంపై విమానాల రాకపోకల వల్ల పూజా విధానాలు, ధార్మిక క్రమాలు లాఘవం చెందే ప్రమాదం ఉంది. గతంలోనూ ఎన్నో మతపెద్దలు, సాంప్రదాయ వేత్తలు తిరుమలను “నో ఫ్లయింగ్ జోన్”గా ప్రకటించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కానీ ఇప్పటివరకు ఈ అంశం యథావిధిగా ఉండిపోతోంది.
డ్రోన్ కలకలం: భద్రతా లోపాలపై మళ్లీ ప్రశ్నలు
తాజాగా మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్కు చెందిన యూట్యూబర్ అన్షుమన్ తరెజా తిరుమల శ్రీవారి ఆలయం పరిసర ప్రాంతాల్లో డ్రోన్ కెమెరా సహాయంతో 10 నిమిషాలపాటు వీడియో షూట్ చేశాడు. ఈ ఘటన మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న హరినామ సంకీర్తన మండపం వద్ద అతను డ్రోన్ను ఎగురవేసినట్లు టీటీడీ విజిలెన్స్ సిబ్బంది గుర్తించారు. భక్తుల మధ్య అర్ధరాత్రి సమయం అయినా డ్రోన్ నింగిలో తిరుగుతుండటం భక్తులను భయభ్రాంతులకు గురిచేసింది. సమాచారాన్ని వెంటనే అందుకున్న విజిలెన్స్ అధికారులు తక్షణమే స్పందించి యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. డ్రోన్ను స్వాధీనం చేసుకొని స్థానిక పోలీసులకు అప్పగించారు.
భద్రతపై కొత్త ఆందోళనలు – చర్యలు తీసుకోవాల్సిన అవసరం
ఈ ఘటన మరోసారి తిరుమల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తింది. దేశంలోని అత్యంత భక్తులు వచ్చే తీర్థక్షేత్రంగా పేరుగాంచిన తిరుమలలో ఈ తరహా సాంకేతిక ఉల్లంఘనలు జరగటం విచారకరం. డీఆర్డీఓ, ఎన్టీఆర్ఎఫ్, పోలీసు విభాగాల సహకారంతో తిరుమలలో ఎప్పటికప్పుడు భద్రతా ముమ్మరం చేస్తున్నట్టు టీటీడీ చెబుతోంది. అయినా ఇటువంటి ఘటనలు జరగడం వల్ల భక్తులలో నమ్మకం దెబ్బతింటోంది. ఇకనైనా తిరుమల కొండలపై “పర్మనెంట్ నో ఫ్లయింగ్ జోన్”గా ప్రకటించి, డ్రోన్లపై సంపూర్ణ నిషేధం విధించాలి. భవిష్యత్తులో శ్రీవారి ఆలయ గోపురాలను, గర్భగృహాన్ని లక్ష్యంగా చేసుకుని ఎవరైనా దురుద్దేశంతో డ్రోన్ వినియోగిస్తే ప్రమాదం తప్పదు.
READ ALSO: Andhra Pradesh: ఏపీ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం