అమెరికా స్టాక్ మార్కెట్ కుదేల్ అయింది. మహా పతకనాన్ని చవి చూసింది. భారీ అమ్మకాల ఒత్తిడితో దడదడలాడింది. నాస్డాక్, ఎస్ అండ్ పీ దారుణంగా పడిపోయాయి. ఏకంగా నాలుగు ట్రిలియన్ డాలర్ల మేర తుడిచిపెట్టుకుపోయింది. ఈ పరిణామం- అగ్రరాజ్యంలో ఆర్థికమాంద్యం నెలకొందనే వాదనలకు మరింత బలాన్ని చేకూర్చినట్టయింది.

ట్రంప్ ఆర్థిక విధానాల ప్రభావం
ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తోన్న వాణిజ్య విధానాలు, భారత్ సహా వివిధ దేశాలపై టారిఫ్ను విధించడం వంటి చర్యలు స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోవడానికి దారి తీసిందనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ట్రేడ్ వార్ మొదలైందని, ఆర్థిక మాంద్యం ఏర్పడిందనే ఆందోళనలు ఇన్వెస్టర్లను భయాందోళనలకు గురి చేశాయి. ఫలితంగా భారీగా అమ్మకాలు సాగాయి. ప్రధానంగా టెక్నాలజీ సెగ్మెంట్కు చెందిన షేర్లను అమ్ముకున్నారు ఇన్వెస్టర్లు.
ఏడాదిలో ఇదే అతిపెద్ద పతనం
2022 తరువాత ఈ సెగ్మెంట్లో అతిపెద్ద ఇంట్రాడే నష్టాలు రికార్డు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.. ఈక్విటీలు మాత్రమే కాకుండా- కార్పొరేట్ బాండ్స్, క్రిప్టోకరెన్సీ సహా ఇతర రంగాల్లో భారీ అమ్మకాల రోజంతా కొనసాగాయి. భారత్ సహా కెనడా, మెక్సికో, చైనా వంటి అనేక దేశాలపై డొనాల్డ్ ట్రంప్ కొత్తగా టారిఫ్ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇది- మార్కెట్లో అనిశ్చితికి దారి తీసినట్టయింది. ఎస్ అండ్ పీ 2.7, నాస్డాక్ నాలుగు శాతం మేర క్షీణించింది. గత ఏడాది డిసెంబర్లో గరిష్ట స్థాయిలో అమెరికా షేర్ మార్కెట్ పతనం కాగా.. ఈ నాలుగు నెలల్లో దాన్ని మించిన స్థాయిలో పడిపోవడం చర్చనీయాంశమైంది. ఎస్ అండ్ పీ 155.64 పాయింట్లను నష్టపోయి.. 5,614.56 వద్ద ముగిసింది. ఈ ఏడాదిలో ఇదే అతిపెద్ద పతనం. నాస్డాక్ 727.90 పాయింట్ల మేర నష్టపోయింది. 17,468.32 వద్ద ట్రేడింగ్ ముగిసింది. ఎలాన్ మస్క్కు చెందిన టెస్లా షేర్లు 15 శాతానికి పైగా పడిపోయాయి. 2020 సెప్టెంబర్ తరువాత అతిపెద్ద ఇంట్రాడే పతనం ఇదే. ఆర్థిక మాంద్యం భయంతో అమెరికా ట్రెజరీ ఇంపోర్ట్స్ భారీగా పడిపోయాయి. ఎన్విడియా, యాపిల్, ఆల్ఫాబెట్ షేర్లు 3 నుండి 5 శాతం వరకు పడిపోయాయి. మెటా, మైక్రోసాఫ్ట్, అమెజాన్ షేర్లు కూడా దీనికి మినహాయింపేమీ కాదు.
మార్కెట్ భవిష్యత్తు – ఏం జరగబోతోంది?
అమెరికా ప్రభుత్వ కొత్త ఆర్థిక విధానాలు కీలకం కానున్నాయి. ఫెడరల్ రిజర్వ్ (Fed) వడ్డీ రేట్లను తగ్గించేందుకు సిద్దమవుతుందా లేదా అనే ప్రశ్న మార్కెట్ను ప్రభావితం చేయగలదు. ఇన్వెస్టర్లు మళ్లీ పెట్టుబడులు పెట్టాలంటే భద్రతా హామీ అవసరం. అమెరికా స్టాక్ మార్కెట్లో నాలుగు ట్రిలియన్ డాలర్లు తుడిచిపెట్టుకుపోవడం ఆర్థిక భయాందోళనలకు సంకేతం. ట్రంప్ విధానాలు, వాణిజ్య పోరు, ఆర్థిక మాంద్యం భయాలు ఈ నష్టాలకు ప్రధాన కారణాలు. ఇకపై ఫెడరల్ రిజర్వ్, ప్రభుత్వ నిర్ణయాలు మార్కెట్ను ఎలా ప్రభావితం చేస్తాయో చూడాలి.