భారతీయ రైల్వే చరిత్రలో ఓ సువర్ణాధ్యాయం లిఖించబడింది. మొట్టమొదటిసారిగా వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును పూర్తిగా మహిళా సిబ్బందితో నడిపి, నారీశక్తి సామర్థ్యాన్ని రైల్వే శాఖ సగర్వంగా చాటిచెప్పింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న ఈ అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. ఈ అద్భుతమైన సంఘటన నారీ శక్తికి నిదర్శనంగా నిలవడమే కాకుండా, భవిష్యత్తులో మహిళలకు మరిన్ని అవకాశాలకు బాటలు వేసింది.
మహిళలతోనే ప్రయాణం
మహిళా దినోత్సవం నాడు.. మహిళలతోనే ప్రయాణం! ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (CSMT) నుంచి ఉదయం 6.20 గంటలకు బయలుదేరిన 22223 CSMT – సాయినగర్ షిర్డీ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు, ఈ చారిత్రాత్మక ప్రయాణానికి వేదికైంది. ఆసియాలోనే మొట్టమొదటి మహిళా లోకో పైలట్ సురేఖా యాదవ్ ఈ రైలుకు సారథ్యం వహించడం మరో విశేషం. ఆమెకు సహాయ లోకో పైలట్గా సంగీతా కుమారి సహకరించారు. రైలు నిర్వహణ బాధ్యతలను శ్వేతా ఘోనే సమర్థవంతంగా నిర్వర్తించారు.

అంతా మహిళలే
టికెట్ తనిఖీ నుంచి క్యాటరింగ్ వరకు అంతా మహిళామయం! ఈ రైలులో ప్రయాణించిన ప్రయాణికులకు టికెట్ తనిఖీ చేసేందుకు ప్రత్యేకంగా మహిళా ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్స్ (TTE) బృందాన్ని ఏర్పాటు చేశారు. హెడ్ టికెట్ ఎగ్జామినర్లు అనుష్క కేపీ, ఎంజే రాజ్పుత్లతో పాటు సీనియర్ టికెట్ ఎగ్జామినర్లు సారికా ఓఝా, సువర్ణా పాష్టే, కవితా మరాళ్, మనీషా రామ్లు ఈ బృందంలో ఉన్నారు. లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్, ట్రైన్ మేనేజర్, టికెట్ ఎగ్జామినర్లు, క్యాటరింగ్ సిబ్బంది.. ఇలా రైలు ప్రయాణానికి సంబంధించిన ప్రతి అంశంలోనూ మహిళలే ఉండటం విశేషం.
వందే భారత్ ఎక్స్ప్రెస్
వేగం, సామర్థ్యం, ఆధునికతకు మారుపేరు! వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు ఇప్పటికే తమ వేగం, సామర్థ్యం, అత్యాధునిక సౌకర్యాలతో భారతీయ రైల్వే ప్రయాణంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాయి. తాజాగా మహిళా సిబ్బందితో నడిచిన ఈ రైలు, సాంప్రదాయకంగా పురుషుల ఆధిపత్యం ఉన్న రంగాలలో లింగ సమానత్వం దిశగా జరుగుతున్న ప్రయత్నాలకు మరింత ఊతమిచ్చింది.