हिन्दी | Epaper

ముందుగానే తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం..

sumalatha chinthakayala
ముందుగానే తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం..

హైదరాబాద్‌: ఒక రోజు ముందుగానే అంటే రేపు (మంగళవారం) తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలకు ముందు ఉదయం పది గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో బీసీ సబ్ కమిటీ కులగణన నివేదిక, ఎస్సీ వర్గీకరణపై ఏక సభ్య కమిషన్ నివేదికను కేబినెట్‌కు అందజేస్తారు.

కుల గణన నివేదిక, ఎస్సీ వర్గీకరణపై చర్చించి మంత్రి మండలి నిర్ణయం తీసుకుంటుంది. క్యాబినెట్ సమావేశం అనంతరం 11 గంటలకు శాసనసభ, శాసనమండలి ప్రత్యేక సమావేశాలు ప్రారంభమవుతాయి. శాసనసభ, శాసనమండలిలో ఈ రెండు నివేదికలను ప్రవేశపెట్టి చర్చిస్తారు. ఈ ప్రత్యేక సమావేశాలను ఒక్కరోజులోనే ముగించనున్నారు.

image

కాగా, అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలను ఈ నెల 15 నుంచి నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. బడ్జెట్‌ సమావేశాల తొలిరోజున గవర్నర్‌ ప్రసంగం ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. అనంతరం 17న రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు తెలిసింది. అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన అనంతరం ఒకట్రెండు రోజులపాటు సమావేశాలు నిర్వహించి, సభను వాయిదా వేస్తారని, పద్దులపై చర్చ, ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ వంటివాటిని మార్చి రెండో వారంలో చేపడతారని తెలిసింది.

బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తర్వాత, ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించే మధ్యకాలంలోనే రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలను నిర్వహిస్తుందని చెప్తున్నారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కూడా ఇదే నెలలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ నెల 15లోగా పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉన్నదని తెలిపారు. ఈ నేపథ్యంలో బడ్జెట్‌కు ఒక రోజు ముందుగాని, వెనుక గాని పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చే అవకాశం ఉన్నదని భావిస్తున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870