తెలంగాణ రాష్ట్రంలోని పదో తరగతి (SSC) పబ్లిక్ పరీక్షలు 2025 మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకు విజయవంతంగా నిర్వహించబడ్డాయి. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5 లక్షలమందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షలు పూర్తయ్యి దాదాపు నెల రోజులవుతున్నా ఫలితాల విడుదలపై స్పష్టత లేకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.

ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్ మరియు పదో తరగతి ఫలితాలు విడుదల చేయగా, తెలంగాణలో మాత్రం ఇంకా పదో తరగతి ఫలితాలు ప్రకటించలేదు. కాగా, ఇంటర్మీడియట్ ఫలితాలు మాత్రం ఇప్పటికే విడుదలై విద్యార్థులను ఉపశమనం కలిగించాయి.
ఏప్రిల్ నెలాఖరులోగా ఫలితాలు
అధికారుల సమాచార ప్రకారం, ఏప్రిల్ 15 నాటికే జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తయ్యింది. ప్రస్తుతం ఫలితాల ప్రకటనకు సంబంధించిన చివరి దశ కార్యాచరణ జరుగుతోంది. ప్రభుత్వ పరీక్షల విభాగం ఫలితాల విడుదలకు సంబంధించిన ఫైల్ను ఉన్నతాధికారులకు పంపించగా, వారు దాన్ని ముఖ్యమంత్రి ఆమోదానికి పంపినట్లు సమాచారం. సీఎం ఆమోదం అనంతరం ఈ నెలాఖరులోగా ఫలితాలు విడుదలయ్యే అవకాశముంది. తెలంగాణ రాష్ట్రంలో పరీక్షలు రాసిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పదో తరగతి పరీక్షల ఫలితాల కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. పదో తరగతి ఫలితాలు విడుదలైన వెంటనే విద్యార్థులు తమ మార్కుల వివరాలు bse.telangana.gov.in లేదా results.bse.telangana.gov.in వెబ్సైట్లలో తెలుసుకోవచ్చు. విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీను నమోదు చేయాల్సి ఉంటుంది. అదే విధంగా ఫలితాలను SMS ద్వారా కూడా పొందవచ్చు. TS10 ROLLNUMBER అని టైప్ చేసి 56263కి పంపితే, ఫలితాలు SMS ద్వారా మీకు వస్తాయి. ఫలితాల ఆలస్యం వల్ల విద్యార్థుల్లో ఫలితాలపై భయాందోళనలు పెరిగిపోతున్నాయి.
Read also: Telangana : తెలంగాణలో ఉష్ణోగతలు పెరగనున్నాయి