మే 25న గ్రామ పాలనాధికారుల నియామక పరీక్ష – పూర్తి వివరాలు విడుదల
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పాలనాధికారుల నియామకానికి సంబంధించి కీలక ప్రకటన వెలువడింది. భూ పరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్ మిత్తల్ ప్రకారం, ఈ పరీక్షను మే 25న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్నట్లు అధికారికంగా వెల్లడించారు. ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు ఈ పరీక్ష కొనసాగనుందని తెలిపారు. హాల్టికెట్లు ఇప్పటికే అధికారిక సీసీఎల్ వెబ్సైట్లో విడుదల చేసినట్లు ఆయన ప్రకటించారు. అభ్యర్థులు తమ హాల్టికెట్లను అక్కడి నుంచే డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. పరీక్ష కేంద్రాలకు సంబంధించిన సమాచారం కూడా అదే వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చని తెలిపారు.
ఈ నియామక ప్రక్రియలో ప్రత్యేకత ఏమిటంటే, పూర్వవీఆర్వో మరియు వీఆర్ఏలకు ఐచ్ఛికంగా పరీక్ష రాయడానికి అవకాశం కల్పించారు. దీనిపై భారీ స్పందన లభించింది. మొత్తం 6196 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, వీరందరికీ అర్హత పరీక్ష మే 25న జరగనుంది. గ్రామ పాలన వ్యవస్థను మరింత పటిష్టం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్య ఎంతో ప్రాధాన్యమైనదిగా అభిప్రాయపడుతున్నారు అధికారులు. ఈ పరీక్షను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని సమాచారం.

టెన్త్ క్లాస్ విద్యార్థులకు రోబోటిక్స్ బోధన ప్రారంభించిన తొలి రాష్ట్రంగా కేరళ
భారత దేశంలో విద్యా రంగంలో విప్లవాత్మక మార్పుల దిశగా ముందడుగులు వేస్తున్న కేరళ ప్రభుత్వం, మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోనే తొలిసారిగా టెన్త్ తరగతి విద్యార్థులకు రోబోటిక్స్ విద్యను తప్పనిసరిగా బోధించే రాష్ట్రంగా కేరళ నిలిచింది. జూన్ 2 నుంచి ప్రారంభమయ్యే కొత్త విద్యా సంవత్సరంతో పాటుగా రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ఈ కొత్త విద్యా విధానాన్ని అమలు చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. పదో తరగతి ఐసీటీ పాఠ్యపుస్తకంలో ఆరో అధ్యాయంగా ‘ది వరల్డ్ ఆఫ్ రోబోట్స్ (The World of Robots)’ అనే శీర్షికతో రోబోటిక్స్కు సంబంధించిన ప్రాథమిక అంశాలను చేర్చారు. విద్యార్థులకు సర్క్యూట్ కన్స్ట్రక్షన్, సెన్సర్ల వాడకం, ఎలక్ట్రానిక్ పరికరాల నియంత్రణ వంటి అంశాలు బోధించనున్నారు.
ఈ కొత్త శిక్షణా విధానం ద్వారా మొత్తం 4.3 లక్షల మంది పదో తరగతి విద్యార్థులు లబ్ధి పొందనున్నారని కేరళ సాంకేతిక విద్యా సంస్థ (KITE) సీఈఓ కే అన్వర్ సాదత్ తెలిపారు. ఇప్పటికే 9,924 మంది ప్రభుత్వ టీచర్లకు మొదటి దశలో శిక్షణను అందించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి అవసరమైన 29,000 రోబోటిక్ కిట్లను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ఉన్నత పాఠశాలలకు పంపిణీ చేశామని ఆయన వివరించారు. ఇది విద్యార్థుల పరిశోధనా నైపుణ్యాలను, సాంకేతిక దృష్టిని పెంపొందించే దిశగా ముందడుగు అని విశ్లేషకులు పేర్కొంటున్నారు.