Telangana Budget 2026: తెలంగాణ రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల 2026-27 వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలపై ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సచివాలయంలో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. గత ఏడాది బడ్జెట్, పనుల పురోగతి, విడుదలైన నిధులపై కూలంకషంగా మంత్రి కోమటిరెడ్డి చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో రోడ్లు, భవనాల శాఖ కీలక పాత్ర పోషిస్తోందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వ్యాఖ్యానించారు. స్పష్టమైన ప్రణాళికతో వార్షిక బడ్జెట్ అంచనాలు ఉండాలని అధికారులను ఆదేశించారు.
Read Also: Balka Suman : బాల్క సుమన్ అరెస్టు !

రీజినల్ రింగ్ రోడ్డు లాంటి గేమ్ చేంజర్ ప్రాజెక్టులపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నాయకత్వంలో 2047 రైజింగ్ తెలంగాణ నినాదంలో రాష్ట్ర రోడ్ నెట్వర్క్ అభివృద్ధి.. అత్యంత కీలకమని చెప్పుకొచ్చారు. సీఎం రేవంత్రెడ్డి(Revant Reddy) రాష్ట్ర రోడ్ నెట్వర్క్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. హ్యామ్ రోడ్ల నిర్మాణంతో రాష్ట్రవ్యాప్తంగా అద్దం లాంటి రోడ్లు నిర్మించబోతున్నామని తెలిపారు. ఇప్పటికే ఉన్న బాలారిష్టాలు దాటేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేశామని.. అధికారులు కూడా మనసుపెట్టి పనిచేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మార్గనిర్దేశం చేశారు.
హైదరాబాద్ నుంచి విజయవాడ రెండున్నర గంటల్లో
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధుల వాటాపై కన్ఫ్యూజన్ లేకుండా పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు. హైదరాబాద్ విజయవాడ (ఎన్హెచ్ 65) 8వ లైన్ విస్తరణ పనులు కూడా త్వరలో ప్రారంభం కానున్నాయని వివరించారు. ఈ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసి మరోసారి కోరతామని అన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎంతో ఉపయోగకరమైన రోడ్డు ఇదని… ఇది పూర్తయితే హైదరాబాద్ నుంచి విజయవాడ రెండున్నర గంటల్లో చేరుకోవచ్చని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా కేంద్రప్రభుత్వం సహకారం అందించే ఆయా ప్రాజెక్టుల్లో వేగం పెంచాలన్నారు. ఈ విషయంలో తాను కేంద్ర మంత్రులను కలుస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పేర్కొన్నారు.
రాష్ట్రంలో లక్ష కోట్లకు పైగా నిధులతో రహదారుల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. హామ్ ప్రాజెక్టులు, రీజినల్ రింగ్ రోడ్డు, హైదరాబాద్-విజయవాడ మార్గం, ఫ్యూచర్ సిటీ నుంచి బందర్ పోర్టు వరకు, రావిర్యాల నుంచి శ్రీశైలం వరకు చేపట్టిన రహదారి అభివృద్ధి పనులు వివిధ దశల్లో ఉన్నాయని వివరించారు. రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి హడ్కో నుంచి రుణం పొందేందుకు ప్రీ బడ్జెట్ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం రాష్ట్ర మోలిక వసతుల అభివృద్ధికి కీలక నిర్ణయమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు అభిప్రాయపడ్డారు.
రాష్ట్రంలో రహదారి మోలిక వసతుల బలోపేతం ద్వారా పెట్టుబడులు, పరిశ్రమలు మరియు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు. అలాగే హైదరాబాద్ కేంద్రంగా సంవత్సరం పొడవునా సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగించేలా సినిమాటోగ్రఫీ శాఖ అధికారులు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని మంత్రి సూచించారు. ఈ సమావేశానికి స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, ఈఎన్సీలు మోహన్ నాయక్, జయ భారతి, సీఈలు శ్రీనివాస్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, వసంత్ నాయక్, బీవీ రావు, లింగారెడ్డి, నర్సింర్రావు, పలువురు ఆర్ అండీబీ అధికారులు హాజరయ్యారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: