हिन्दी | Epaper

Telangana Panchayat Elections : రెండో విడత కౌంటింగ్‌లో కాంగ్రెస్ జోరు.. ఒక్క ఓటుతో విజయం!…

Sai Kiran
Telangana Panchayat Elections : రెండో విడత కౌంటింగ్‌లో కాంగ్రెస్ జోరు.. ఒక్క ఓటుతో విజయం!…

Telangana Panchayat Elections : తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఆదివారం రాత్రి 8 గంటల వరకు వెల్లడైన ఫలితాల ప్రకారం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న సర్పంచ్ అభ్యర్థులు భారీగా ఆధిక్యం సాధించారు. ఇప్పటివరకు కాంగ్రెస్ మద్దతుదారులు 1705కు పైగా గ్రామ పంచాయతీల్లో గెలుపొందగా, బీఆర్‌ఎస్ మద్దతు అభ్యర్థులు 889 స్థానాల్లో విజయం సాధించారు. బీజేపీకి 197 స్థానాలు దక్కగా, ఇతరులు 475కు పైగా స్థానాల్లో గెలిచారు.

ఈ రెండో విడతలో మొత్తం 193 మండలాల్లో 3911 గ్రామ పంచాయతీ సర్పంచ్‌లు, 29,917 వార్డు సభ్యులకు పోలింగ్ జరిగింది. అంతకుముందు తొలి విడత ఎన్నికల్లో 4236 గ్రామాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు 2334 చోట్ల సర్పంచ్‌లుగా గెలిచారు. బీఆర్‌ఎస్‌కు 1169, బీజేపీకి 189, ఇతరులకు 538 స్థానాలు దక్కాయి.

Read also: Actress Vahini: క్యాన్సర్ తో బాధపడుతున్న నటి వాహిని

ఈ ఎన్నికల్లో కొన్ని చోట్ల ఒక్క ఓటు తేడాతో ఫలితాలు తేలడం ఆసక్తికరంగా మారింది. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం గణేశ్‌పాడులో బీఆర్‌ఎస్ మద్దతుదారు రమేశ్ నాయక్ కాంగ్రెస్ అభ్యర్థిపై ఒక్క ఓటుతో విజయం సాధించారు. అదే జిల్లాలో ఇసుకబావిగూడెంలో కల్లూరి అనిత కూడా ఒక్క ఓటు తేడాతో సర్పంచ్‌గా (Telangana Panchayat Elections) ఎన్నికయ్యారు. రంగారెడ్డి జిల్లా చేవేళ్ల మండలం గుండాలలో బుచ్చిరెడ్డి, వికారాబాద్ జిల్లా రాంపూర్‌లో కాంగ్రెస్ మద్దతుదారు రమాదేవి, కరీంనగర్ జిల్లా అంబాల్‌పూర్‌లో వెంకటేశ్, వరంగల్ జిల్లా సంగెం మండలం ఆశాలపెల్లిలో కొంగర మల్లమ్మ ఒక్క ఓటు మెజార్టీతో గెలిచారు.

ఇదిలా ఉండగా, నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం ధర్మపురంలో కౌంటింగ్ సమయంలో ఉద్రిక్తత నెలకొంది. బ్యాలెట్ పేపర్లు అపహరించారనే ఆరోపణలతో బీఆర్‌ఎస్, రెబల్ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పొలంపల్లిలో కూడా స్వల్ప ఓట్ల తేడాతో రెండుసార్లు లెక్కింపు జరిగినప్పటికీ వివాదం తలెత్తడంతో పోలీసులు లాఠీఛార్జి చేశారు.

మరోవైపు సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం పిపడ్‌పల్లిలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న కాంగ్రెస్ మద్దతుదారు సర్పంచ్ అభ్యర్థి చల్కి రాజు, ఈరోజు ఓట్ల లెక్కింపులో 9 ఓట్ల తేడాతో గెలిచినట్లు తేలింది. ఈ నేపథ్యంలో ఆ గ్రామంలో మళ్లీ ఎన్నికలు నిర్వహించే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870