బీసీ వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు ( 42% BC Quota) ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ఇటీవల వరకు రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన చర్చగా నిలిచింది. ఈ హామీని కేంద్రబిందువుగా చేసుకుని స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ సన్నద్ధమవుతూ, “బీసీ హక్కుల కోసం పోరాడే ఏకైక పార్టీ మనదే” అనే నినాదంతో ప్రచారం కూడా మొదలుపెట్టింది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన వెంటనే, పార్టీ శ్రేణులు ఉత్సాహంగా రంగంలోకి దిగి విజయమే లక్ష్యంగా ముమ్మరంగా సిద్ధమయ్యాయి. అయితే, ఈ జోష్కి హైకోర్టు స్టే ఆర్డర్ చల్లని నీళ్లు చల్లినట్టైంది.
Latest News: Bigg Boss 9: వరుస ఇంటర్వ్యూలతో హరిత హరీష్
హైకోర్టు ఎన్నికల నోటిఫికేషన్తో పాటు బీసీ రిజర్వేషన్లపై కూడా స్టే విధించడం కాంగ్రెస్ క్యాడర్ను ఒక్కసారిగా నిరాశలోకి నెట్టింది. ముఖ్యంగా ఈ ఎన్నికలను బీసీ రిజర్వేషన్ అజెండాతో గెలుచుకుందామనుకున్న నాయకత్వానికి ఇది పెద్ద షాక్గా మారింది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, మండల స్థాయిలో సిద్ధమవుతున్న కార్యకర్తలు ఇప్పుడు దిశా నిర్దేశం కోసం ఎదురుచూస్తున్నారు. పార్టీ ఇచ్చిన హామీ చట్టపరమైన అడ్డంకుల వల్ల నిలిచిపోవడంతో, ప్రత్యర్థి పార్టీలు దీనిని కాంగ్రెస్పై దాడిగా ఉపయోగించుకుంటున్నాయి.

ప్రస్తుతం కాంగ్రెస్ అధిష్ఠానం ఈ పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేస్తుందో అన్నదే ఆసక్తికర అంశంగా మారింది. కార్యకర్తల్లో ఉత్సాహం పునరుద్ధరించేందుకు, ప్రభుత్వం నిజాయితీతో ప్రయత్నించిందన్న సందేశాన్ని ఎలా చాటి చెబుతుందో చూడాలి. మరోవైపు, హైకోర్టు తదుపరి విచారణలో ఏదైనా అనుకూల నిర్ణయం వస్తే మళ్లీ క్యాడర్కు ఉత్సాహం చేకూరే అవకాశం ఉంది. కానీ అప్పటివరకు పార్టీ తాత్కాలికంగా రక్షణాత్మక స్థితిలోకి వెళ్ళినట్టే కనిపిస్తోంది.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/