రాష్ట్రంలో వచ్చే కొన్ని రోజులు వర్షాలు ముమ్మరంగా కురిసే అవకాశముందని హైదరాబాద్ (Hyderabad) వాతావరణశాఖ స్పష్టంచేసింది. గురువారం, శుక్రవారం, శనివారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు (Rains) కురిసే అవకాశముందని తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని అధికారులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పనుల కోసం తప్ప బయటకు వెళ్లవద్దని సూచించారు.గురువారం మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని కూడా సూచించింది.

శుక్రవారం మరిన్ని జిల్లాలకు హెచ్చరిక
శుక్రవారం ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ ప్రకటించింది.శనివారం నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది.
ఇతర జిల్లాల్లో వర్ష సూచనలు
ఆదిలాబాద్, కుమ్రం భీం, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో కూడా అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాలకు కూడా ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.
ప్రజలకు సూచనలు
రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం పూర్తిగా మారబోతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా నదీ, వాగుల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అదనంగా తుపానుగాలులు వీచే అవకాశం ఉన్నందున చెట్ల క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండవద్దని వాతావరణశాఖ హెచ్చరించింది. విద్యుత్ లైన్లు, నీటి పైపుల దగ్గర జాగ్రత్తగా ఉండాలని, అవసరమైతే స్థానిక అధికారుల సూచనలు పాటించాలని కోరింది. తెలంగాణలో రాబోయే మూడు రోజులు వర్షాల బారిన పడే అవకాశం ఎక్కువ. అందుకే ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి, వర్షం తీవ్రతను అంచనా వేసుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Read Also :