కొత్తగా 14,084 మందికి పెన్షన్ మంజూరు : మంత్రి సీతక్క
హైదరాబాద్: హెచ్ఐవి (HIV) బాధితులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి మానవీయంగా స్పందించింది. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క(Sitakka) సోమవారం 14,084 మంది కొత్త హెచ్ఐవి బాధితులకు చేయూత పెన్షన్లు మంజూరు చేస్తూ ఫైల్పై సంతకం చేశారు. ఈ పెన్షన్లు (Pensions) జూలై నెల నుంచి లబ్దిదారులు అందుకోనున్నారు. హెచ్ఐవి బాధితులు పూర్తి స్థాయిలో పని చేయలేని స్థితిలో ఉండటంతో పాటు, వారిపై నెలనెలా అధిక వైద్య ఖర్చులు కూడా పడుతు న్నాయి. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

హెచ్ఐవి బాధితులకు పెన్షన్లు
పేదరికంతో బాధపడుతున్న హెచ్ఐవి బాధితుల జీవిత నాణ్యతను మెరుగుపరిచేందుకు చేయూత పథకం కింద ఈ సాయం అందించనున్నారు. ఇప్పటికే 34,421 మందికి నెలకు రూ.2016 చొప్పున పెన్షన్ అందుతోంది. ఇందుకోసం రాష్ట్రం నెలవారీగా రూ.6.93 కోట్లు ఖర్చు చేస్తోంది. 2022 ఆగస్టు తరువాత హెచ్ఐవి కేటగిరీలో కొత్తగా పెన్షన్లు మంజూర వ్వలేదు. అయితే తాజాగా తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (టిజిఎస్ఏసిఎస్) ఆధ్వర్యంలో కొత్తగా నమోదు అయిన 14,084 మందికి అర్హతలు నిర్ధారించిన అనంతరం ఎస్ఈఆర్పి ద్వారా పెన్షన్లు మంజూరు అయ్యాయి. జిల్లాల వారీగా అర్హుల సంఖ్య హైదరాబాద్ 3,019, నల్గొండ 1,388, ఖమ్మం 954, సూర్యాపేట 931, కరీంనగర్ 833, ఆదిలాబాద్ 482, భద్రాద్రి కొత్తగూడేం 556, హన్మకొండ 825, జగిత్యాల 306, జనగాం 228, కామారెడ్డి 702, మహబూబ్ నగర్ 452, నిజామాబాద్ 528, పెద్దపల్లి 567, సంగారెడ్డి 1242, సిద్దిపేట 527, వికారాబాద్ 544. అయితే జయశంకర్ భూపాలపల్లి, గద్వాల్, మంచిర్యాల, మెదక్, ములుగు, నాగర్కర్నూల్, నారాయణపేట, నిర్మల్, రంగారెడ్డి తదితర జిల్లాల్లో కొత్తగా ఒక్కరు కూడా నమోదు కాలేదని అధికారులు తెలిపారు. ఈ నూతన లబ్దిదారులకు ఈ ఆర్థిక సంవత్సరానికి అంచనా వ్యయం రూ.28.40 కోట్లు కాగా, కావాల్సిన నిధులు ప్రభుత్వం వద్ద సిద్ధంగా ఉన్నాయని అధికారవర్గాలు స్పష్టం చేశాయి. ఇప్పటికే 4020 మంది డయాలసిస్ పేషెంట్లకు ఈ మద్యే పించన్ మంజూరు చేయగా.. తాజాగా హెచ్ఐవి బాధితులకు పించన్ మంజూరు చేయడంతో ఈ వర్గాలు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపాయి.
Read also: Telangana: దోస్త్-2025 సెల్ఫ్ రిపోర్టింగ్ గడువు పెంపు