Sravan rao: ఎట్టకేలకు ఫోన్​ ట్యాపింగ్ కేసులో విచారణకు శ్రవణ్​ రావు హాజరు

Read Time:  1 min
ఎట్టకేలకు ఫోన్​ ట్యాపింగ్ కేసులో విచారణకు శ్రవణ్​ రావు హాజరు
ఎట్టకేలకు ఫోన్​ ట్యాపింగ్ కేసులో విచారణకు శ్రవణ్​ రావు హాజరు
FONT SIZE
GET APP

ఫోన్‌ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడుగా ఉన్న శ్రవణ్‌రావు శనివారం సిట్‌ ముందు విచారణకు హాజరయ్యారు. మార్చి 29న తెల్లవారుజామున దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌ చేరుకున్న ఆయన, విచారణ కోసం జూబ్లీహిల్స్‌ ఏసీపీ కార్యాలయానికి వచ్చారు. పోలీసుల విచారణకు సహకరించాలని శ్రవణ్‌రావును సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశించిన సంగతి తెలిసిందే. ఆయన్ను అరెస్టు చేయొద్దని తెలిపింది. శ్రవణ్‌ను విచారణ చేస్తే కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు.

ఎట్టకేలకు ఫోన్​ ట్యాపింగ్ కేసులో విచారణకు శ్రవణ్​ రావు హాజరు

అమెరికాలో తలదాచుకున్న శ్రవణ్‌రావు
కుటుంబ సభ్యులకు నోటీస్ : ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఆరో నిందితుడిగా ఉండి అమెరికాలో తలదాచుకున్న ఓ మీడియా సంస్థ నిర్వాహకుడు అరువెల శ్రవణ్‌రావుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఇటీవల నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈనెల 29న(శనివారం) తమ ఎదుట విచారణకు హాజరు కావాలని అందులో సిట్ సూచించింది. నోటీస్‌ ప్రతిని ఈనెల 26న హైదరాబాద్‌లోని ఆయన కుటుంబసభ్యులకు అందజేసింది.
రెడ్​కార్నర్ నోటీస్ జారీ
2024 మార్చి 10న పంజాగుట్ట పోలీస్ స్టేషన్​లో కేసు నమోదైన వెంటనే ఆయన తొలుత లండన్‌కు వెళ్లారు. వెంటనే అక్కడి నుంచి అమెరికాకు వెళ్లిపోయారు. సిట్‌ విచారణకు రాకుండా గత కొన్ని నెలలుగా అక్కడే ఉండిపోయారు. ఇటీవలే ఆయనపై అమెరికాలో రెడ్‌కార్నర్‌ నోటీస్‌ సైతం జారీ అయింది. తనకు ముందస్తు బెయిల్‌ను నిరాకరిస్తూ తెలంగాణ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ శ్రవణ్ రావు ఇటివలే సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పీ దాఖలు చేశారు.
అరెస్ట్‌ చేయకుండా మధ్యంతర ఉపశమనం
దర్యాప్తునకు సహకరించాలి : దానిపై ఈనెల 24న జరిగిన విచారణలో శ్రవణ్ రావును అరెస్ట్‌ చేయకుండా ఆయనకు మధ్యంతర ఉపశమనం లభించింది. కానీ ధర్మాసనం పోలీసుల దర్యాప్తునకు సహకరించాలనే షరతు విధించింది. అందుకు పిటిషనర్‌ న్యాయవాది అంగీకరిస్తూ అవసరమైతే ఆయన 48 గంటల్లోగా భారత్‌కు తిరిగి వస్తారని సుప్రీం కోర్టుకు హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే 72(3 రోజులు) గంటల గడువు విధిస్తూ శనివారం తమ వద్ద విచారణకు రావాలని సిట్‌ స్పష్టం చేసింది. దీంతో ధర్మాసనానికి ఇచ్చిన హామీ ప్రకారం శ్రవణ్‌రావు ఈ రోజు విచారణకు హాజరయ్యారు.
ప్రధాన అభియోగం ఇదే : స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కేంద్రంగా ఎవరెవరిపై నిఘా ఉంచాలనే విషయంలో శ్రవణ్ రావు సూచన మేరకే కీలక నిందితులు ప్రభాకర్రావు, ప్రణీత్ రావు నడుచుకున్నారనేది తెలంగాణ దర్యాప్తు సంస్థ ప్రధాన అభియోగం. శ్రవణ్ రావు తాను చేసిన సర్వే ఆధారంగానే పలువురిపై నిఘా ఉంచాలని కీలక నిందితులకు సూచించారని ప్రాథమిక ఆధారాలను బట్టి దర్యాప్తు అధికారులు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
ఎన్నికల్లో బీఆర్​ఎస్​కు లబ్ది
2023 తెలంగాణ శాననసభ ఎన్నికల్లో బీఆర్ఎస్​కు లబ్ది చేకూర్చేందుకే కాంగ్రెస్ అభ్యర్థులతోపాటు వారికి ఆర్థిక వనరులు సమకూర్చుతున్న వ్యాపారులపై నిఘా ఉంచాలని శ్రవణ్ రావు సూచించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. శ్రవణ్​ రావును విచారించడం ద్వారా ఈ విషయాలపై స్పష్టత రానున్నట్లు భావిస్తున్నారు. మీడియాలో పనిచేస్తూ బీఆర్​ఎస్​కు లబ్ధి చేకూర్చాల్సిన అవసరమెందుకనే విషయాన్ని తేల్చడం ద్వారా ఈ కేసు కీలక మలుపు తిరుగుతుందని దర్యాప్తు అధికారులు నమ్ముతున్నారు. ఇదే జరిగితే ఫోన్ ట్యాపింగ్ వెనుక రాజకీయ ప్రముఖుల పాత్ర బహిర్గతమవుతుందనేది వారి భావనగా కనిపిస్తోంది.

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.