రెండు బాలల సంరక్షణ కేంద్రాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్: ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా మరో 18 ప్రత్యేక దత్తత కేంద్రాలు (ఎస్ఏఎస్), 2 బాలల సంరక్షణ కేంద్రాలు (Children’s Homes) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ప్రతి పాదనలు పూర్తి కాగా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క (Seethakka) ఆ ఫైల్పై శుక్రవారం నాడు సంతకం చేశారు. సీఎం ఆమోదం లభించిన వెంటనే ఈ కేంద్రాల ఏర్పాటుకు అధికారిక ప్రక్రియ ప్రారంభమవుతుంది. తెలంగాణలో శిశు సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. అనాథలు లేదా తల్లిదండ్రులు వదిలి వేసిన పిల్లలను దత్తత కేంద్రాల్లో సంరక్షిస్తూ, వారికి అన్ని అవసరాలను అందించడంతో పాటు, నిబంధనల ప్రకారం దత్తత ఇచ్చే ప్రక్రియను చేపడుతోంది.

18 కొత్త కేంద్రాల ఏర్పాటు
ప్రస్తుతం రాష్ట్రంలో 15 జిల్లాల్లో 17 దత్తత కేంద్రాలు (Adoption centers) ఉన్నాయి. వీటికి అదనంగా 18 కొత్త కేంద్రాల ఏర్పాటుతో మొత్తం దత్తత కేంద్రాల సంఖ్య 35కి చేరనుంది. పిల్లల అక్రమ విక్రయాలు, అనధికార దత్తతలపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. దీనికి కొనసాగింపుగా దత్తత కేంద్రాలు, బాలల సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ ప్రణాళికల అమలుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆమోదం తెలిపింది. కొత్తగా ఏర్పాటయ్యే కేంద్రాల నిర్వహణ, పిల్లల బాగోగుల కోసం ఏటా రూ.5.44 కోట్లు ఖర్చు అవుతాని తెలంగాణ ప్రభుత్వం అంచనాలు సిద్ధం చేసింది. అందులో 60 శాతం (రూ. 3.26 కోట్లు) కేంద్ర ప్రభుత్వం, మిగిలిన 40 శాతం (రూ.2.17 కోట్లు) రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది. ఈ కేంద్రాల్లో సేవలందించేందుకు 228 మంది సిబ్బందిని అవుట్సోర్సింగ్ విధానంలో నియమించనున్నారు. ముఖ్యమంత్రి సంతకం అనంతరం ఈ ప్రాజెక్టు అమలు ప్రారంభమవుతుంది. ఈ నిర్ణయం రాష్ట్రంలోని నిరాశ్రయ పిల్లల భద్రతకు, దత్తత ప్రక్రియ పారదర్శకతకు మరింత బలాన్ని చేకూర్చనుంది .
Read hindi news: hindi.vaartha.com
Read also: Sridhar Babu: పర్యావరణహిత నిర్మాణాలే పరిష్కారం- మంత్రి శ్రీధర్ బాబు