గత మూడు రోజులుగా ఎండలతో ఉక్కిరి బిక్కిరైనా హైదరాబాద్ (Hyderabad) ప్రజలను వరుణ దేవుడు ఈరోజు భీకర వర్షంతో పలకరించాడు. రాజధానిలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం (Rains) కురుస్తోంది. గంటపాటు కురిసిన వర్షానికే రోడ్లన్నీ జలమయం అయ్యాయి, లోతట్టు ప్రాంతాలు నదులను తలపించాయి. మధ్యాహ్నం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ఈ వర్షాలకు నగరమంతా తడిసి ముద్దైంది. వాతావరణ శాఖ ప్రకారం, క్యూమిలోనింబస్ మేఘాల ప్రభావంతో తక్కువ సమయంలోనే ఈ భారీ వర్షాలు కురిశాయి. మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, పంజాగుట్ట, ఖైరతాబాద్, అమీర్పేట్, ఎర్రగడ్డ, మూసాపేట, బోరుబండ, యూసఫ్గూడ, సనత్ నగర్, అబిడ్స్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, నారాయణ గూడ, సికింద్రాబాద్, పఠాన్ చెరువు, కూకట్పల్లి, షేక్పేట్, దుర్గం చెరువు, మణికొండ, దిల్సుఖ్నగర్తో సహా నగరంలోని అనేక ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.
ట్రాఫిక్ కష్టాలు – ప్రజల అవస్థలు
సాధారణంగానే ట్రాఫిక్ జామ్లతో సతమతమయ్యే హైదరాబాద్ నగరంలో, ఈ వర్షాల కారణంగా పరిస్థితి మరింత దయనీయంగా మారింది. రోడ్లు నదులుగా మారడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. ముఖ్యంగా మాదాపూర్, గచ్చిబౌలి, ఐటీ హబ్ శిల్పారామం, అమీర్పేట, కూకట్పల్లి వంటి జంక్షన్లలో వాహనాలు నిలిచిపోయాయి. ఆఫీసుల నుంచి ఉద్యోగస్తులు, స్కూళ్ల నుంచి విద్యార్థులు తిరిగి వెళ్లే సమయం కావడంతో, ఈ ట్రాఫిక్ జామ్ ప్రభావం మరింత తీవ్రంగా ఉంది. నేడు సోమవారం కావడంతో ఐటీ ఉద్యోగస్తులు తప్పకుండా ఆఫీసులకు వెళ్లాల్సి రావడంతో ట్రాఫిక్ రద్దీ విపరీతంగా పెరిగింది.
రానున్న ఐదు రోజులు భారీ వర్షాలు – వాతావరణ శాఖ హెచ్చరిక
వాతావరణ శాఖ సూచనల ప్రకారం, నేటి నుంచి రానున్న ఐదు రోజుల పాటు హైదరాబాద్తో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు రావద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని, ప్రభుత్వ విపత్తు నిర్వహణ బృందాలు కూడా సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని సూచించారు. వర్షాల వల్ల కలిగే ఇబ్బందుల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి.
Read Also : Sonusood: సినీ నటుడు ఫిష్ వెంకట్ కుటుంబాన్ని పరామర్శించిన సోనూసూద్