ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) వ్యవసాయ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో, ఖరీఫ్ పంటల సీజన్ నేపథ్యంలో రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా నకిలీ విత్తనాల సరఫరా చేసే వ్యాపారులు, కంపెనీలపై పీడీ యాక్ట్ (Preventive Detention Act) అమలు చేయాలని ఆదేశించడం రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తోంది.

వ్యవసాయ అధికారులకు ఆదేశాలు
రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి, ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావు, వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపితో పాటు ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
రేవంత్ రెడ్డి మాట్లాడుతూ
రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నకిలీ విత్తనాలు (Fake seeds) , ఎరువులు విక్రయించే వ్యాపారులపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. కల్తీ, నకిలీ విత్తనాల దందాలపై అన్ని జిల్లాల్లో కలెక్టర్లు, పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
జిల్లాల వారీగా టాస్క్ఫోర్స్ దాడులు
జిల్లాల వారీగా వ్యవసాయ శాఖ, పోలీస్ విభాగం సంయుక్తంగా టాస్క్ ఫోర్స్ దాడులు నిర్వహించాలని చెప్పారు. రాష్ట్ర సరిహద్దులు అన్ని చోట్లా టాస్క్ ఫోర్స్ నిఘా ఉంచాలని రేవంత్ రెడ్డి చెప్పారు. రైతులను మోసం చేసే వారిపై కఠినంగా వ్యవహరించాలని అధికారులను సీఎం హెచ్చరించారు. ఎవరెవరు కల్తీ విత్తనాలు విక్రయిస్తున్నారు, ఎక్కడ నిల్వలు ఉన్నాయి ఎక్కడ నుంచి రవాణా అవుతున్నాయనే వివరాలన్నీ అధికారులకు సమాచారం ఉందని, ఎవరినీ ఉపేక్షించకుండా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని అన్నారు. నకిలీ దందా చేసే వ్యాపారులపై పీడీ యాక్ట్ కేసులు పెట్టాలని అన్నారు. అన్ని జిల్లాల్లో సరిపడే విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయని ఈ సందర్భంగా అధికారులు ఆయనకు వివరించారు. ఈ సీజన్ లో వరి, పత్తి సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉంటుందని, రైతుల నుంచి డిమాండ్ ఉన్న అన్ని కంపెనీల విత్తనాలు మార్కెట్ లో అందుబాటు ఉన్నాయని వివరించారు.
రైతులకు జాగ్రత్త సూచనలు
రుతుపవనాలు ముందే వస్తుండటంతో రాష్ట్రంలోనూ వానలు ముందుగానే కురిసే అవకాశముందని వాతావరణ శాఖ చేసిన సూచనలను రైతులు గమనించాలని సూచించారు. అందుకు అనుకూలంగా సరైన అదనులో పంటలు వేసుకోవాలని, నకిలీ విత్తనాలు కొని మోసపోవద్దని రైతులకు ఆయన కోరారు. ప్యాక్డ్ విత్తనాలు తప్ప లూజ్ విత్తనాలు కొనుగోలు చేయవద్దని, విత్తన పాకెట్లు కొనేటప్పుడు తప్పకుండా బిల్లును, పాకెట్ ను పంట కాలం ముగిసేంత వరకు భద్రపరుచుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యక్షంగా చొరవ తీసుకుని రైతులకు అవసరమైన నాణ్యమైన విత్తనాలు, ఎరువులు సమకూర్చడానికి చర్యలు చేపడుతుందని తెలిపారు.
Read also: Revanth Reddy: హజ్ యాత్రలకు వెళ్లే ముస్లింలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం:రేవంత్ రెడ్డి