గత నాలుగు రోజులుగా మోస్తరు నుంచి భారీ వర్షాలతో అల్లాడిన హైదరాబాద్ (Hyderabad) వాసులకు ఎట్టకేలకు ఉపశమనం లభించింది. శనివారం నాడు నగరంలో వర్షాలు తగ్గిపోయి, వాతావరణం పొడిగా మారింది. వర్షాలు ఆగిపోవడంతో జనజీవనం మళ్లీ సాధారణ స్థితికి వస్తోంది. , రోడ్లపై నీటి నిల్వలు కాస్త తగ్గిన నేపథ్యంలో ప్రజలు నిత్య కార్యకలాపాలను పునరుద్ధరించుకున్నారు. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం, ఆదివారం కూడా నగరంలో వర్షం పడే అవకాశం లేదు. పడినా తుంపర జల్లులకే పరిమితం అవుతుందని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు.
ఉత్తర తెలంగాణలో వర్షాల ప్రభావం
తెలంగాణలోని ఉత్తర జిల్లాల్లో మాత్రం వర్షాలు కొనసాగుతున్నాయి. ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, ములుగు, జయశంకర్ భూపాలపల్లి వంటి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గంటకు 30–40 కి.మీ వేగంతో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. రాత్రి సమయంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు.
వర్షాల నివారణకు ప్రభుత్వం చర్యలు – రూ.33 కోట్లు విడుదల
తెలంగాణలో వరుస వర్షాల ప్రభావాన్ని అధిగమించేందుకు ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలోని 33 జిల్లాలకు ఒక్కో జిల్లాకు రూ.1 కోటి చొప్పున మొత్తం రూ.33 కోట్లు విడుదల చేసింది. డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగానికి అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించేందుకు ఈ నిధులను కేటాయించింది. ఈ నిధుల ద్వారా రహదారులు, నీటి కాల్వలు, మౌలిక సదుపాయాల పునరుద్ధరణ పనులను వేగంగా చేపట్టనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. పల్లెల్లో, పట్టణాల్లో వర్షాల కారణంగా ఏర్పడ్డ ఇబ్బందులను తక్కువ సమయంలో పరిష్కరించేందుకు ఈ నిధులు ఉపయోగపడనున్నాయి.
Read Also : Godavari : ఏపీలో పెరుగుతున్న గోదావరి వరద ఉధృతి, లోతట్టు ప్రాంతాలవారికి హెచ్చరిక!