हिन्दी | Epaper

Rain Alert: అల్పపీడనం, నైరుతి రుతుపవనాలతో కుండపోత వర్ష సూచన

Sharanya
Rain Alert: అల్పపీడనం, నైరుతి రుతుపవనాలతో కుండపోత వర్ష సూచన

తెలుగు రాష్ట్రాల్లో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, దానికి తోడు నైరుతి రుతుపవనాలు విస్తరించడంతో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు (rains) పడుతున్నాయి. వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసారు.

అల్పపీడన ప్రభావం – రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి

బంగాళాఖాతంలో ప్రస్తుతం దక్షిణ మధ్య భాగంలో అల్పపీడన ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఇది ఉత్తరాంధ్ర మీదుగా తెలంగాణను ప్రభావితం చేస్తోంది. దాని వల్ల ఉపరితల ఆవర్తనం మధ్య ట్రోపోస్పియర్ స్థాయి వరకు కొనసాగుతుండగా, వర్షాల తీవ్రత మరింత పెరుగుతోంది. మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాలు ఇప్పటికే రుతుపవనాల వల్ల తడిసి ముద్దవుతున్నాయి. ఉత్తర తెలంగాణ, దక్షిణ ఛత్తీస్గడ్ – దక్షిణ ఒడిస్సా మీదుగా ఉత్తరాంధ్ర తీరం వరకు సగటుమట్టానికి 3.1 నుండి 5.8 కిలోమీటర్ల మధ్యలో ద్రోణి కొనసాగుతోంది.

తెలంగాణలో వర్షపాతం – జిల్లాల వారీగా పరిస్థితి

తెలంగాణ (Telangana) లో నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. వీటి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్, కోమురంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఈ రోజు గరిష్టంగా ఆదిలాబాద్ లో 37.8, కనిష్టంగా మహబూబ్ నగర్ లో 27.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. రాగల మూడు రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఐదు నుండి ఏడు డిగ్రీలు తక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ఆంధ్రప్రదేశ్‌లో వర్ష సూచనలు – మూడు రోజులపాటు వర్షాలు

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకారం, రానున్న 24 గంటల్లో పశ్చిమమధ్య మరియు ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ నేపధ్యంలో రాష్ట్రంలో మూడు రోజులపాటు చెదురుమదురుగా భారీ వర్షాలతో (Heavy rains) పాటుగా, కొన్నిచోట్ల 50-60కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.

మంగళవారం (27-05-2025): జిల్లాల వారీగా వర్ష సూచన

ఈరోజు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కోనసీమ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

బుధవారం (28-05-2025): వర్ష సూచనలు

బుధవారం నాడు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం, నంద్యాల, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నప్పటికీ, వాతావరణం పూర్తిగా మేఘావృతంగా ఉండే అవకాశముంది.

నిన్న సాయంత్రం 5 గంటల నాటికి రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా అల్లూరి జిల్లాలోని రాచపనుకులో 56 మిల్లీమీటర్లు, విజయనగరంలో 42.7 మిమీ, మారేడుమిల్లిలో 41.5 మిమీ, నెల్లిమర్లలో 33 మిమీ వర్షపాతం నమోదైంది. కర్నూలు జిల్లా కామవరంలో 31.5 మిమీ వర్షపాతం నమోదు కావడం గమనార్హం.

Read also: Fish Prasadam Distribution : చేప ప్రసాదం పంపిణీ తేదీలు ఖరారు!

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870