తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబీ (SIB) మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు (Pranith Rao) విచారణ ముగిసింది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) అధికారులు ఈరోజు దాదాపు ఐదు గంటల పాటు ఆయనను విచారించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బాధితుల వాంగ్మూలాలను పరిశీలించిన అనంతరం, వాటి ఆధారంగా ప్రణీత్ను ప్రశ్నించినట్లు సమాచారం. గతంలోనూ జూన్ 13, 18 తేదీల్లో ప్రణీత్ రావును అధికారులు విచారించిన సంగతి తెలిసిందే.
ఎవరి ఆదేశాలపై ట్యాపింగ్?
విచారణలో ముఖ్యంగా “ఎవరి ఆదేశాల మేరకు ఫోన్లు ట్యాప్ చేశారో?” అనే అంశంపై సిట్ అధికారులు ప్రణీత్ను గట్టిగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ట్యాపింగ్ వెనుక ఉన్న అసలు మర్మం తెలుసుకునేందుకు ప్రయత్నించిన సిట్, ప్రణీత్ నుంచి కీలక సమాచారం రాబట్టినట్లు సమాచారం. ఈ కేసులో ఎవరి పాత్ర ఎంత వరకు ఉందో నిర్ధారించేందుకు అనేక కోణాల్లో విచారణ సాగించినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.
ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారన్న దానిపై దృష్టి
ఈ కేసులో అసలు ఎవరెవరి ఫోన్లు ట్యాప్ అయ్యాయన్న అంశంపైనా సిట్ దృష్టి పెట్టింది. రాజకీయ నేతలు, ఉద్యోగులు, జర్నలిస్టుల ఫోన్లను లక్ష్యంగా చేసారా? అనే కోణంలో విచారణ కొనసాగించినట్లు తెలుస్తోంది. ఇది ఒకవ్యక్తిగత చర్యా? లేక రాజకీయ నాయకుల ప్రమేయం ఉన్న వ్యవహారమా? అనే దానిపై స్పష్టత తీసుకురావడానికి అధికారులు మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నారు. త్వరలోనే ఈ కేసులో మరిన్ని కీలక మలుపులు వచ్చే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Read Also : Sonia Gandhi: నరమేధం పట్ల భారత్ మౌనంగా వీడాలి .. సోనియా