హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డిని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ బుధవారం ఉదయం మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని తన నివాసానికి వచ్చిన ఏఐసీసీ ఇంచార్జి మీనాక్షిని ముఖ్యమంత్రి సాదరంగా ఆహ్వానించి ఆమెకు పూల బొకే అందించారు. అనంతరం శాలువా కప్పి సత్కరించారు. నూలు వడికే చరఖా, మొక్కను బహుమతిగా అందజేశారు. ఆ సమయంలో సీఎం వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఉన్నారు. అనంతరం పార్టీ కార్యక్రమాలు, టీచర్స్, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి గల కారణాలపై సమీక్ష నిర్వహించినట్లు తెలుస్తోంది. దీనికి తోడు వచ్చే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై, అభ్యర్థుల ఎంపికపై చర్చ జరిగినట్లు సమాచారం.

ఫీడ్ బ్యాక్ పై సీఎంతో మీనాక్షి చర్చ
సుమారు గంటకు పైగా జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఎలాంటి విధి విధానాలు పాటించాలనేదానిపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ అవకాశం కోసం భారీగా పోటీ ఉన్న నేపథ్యంలో అభ్యర్థుల ఖరారు విషయంలో ఏ రకంగా వడపోత చేపడితే పార్టీకి ఇబ్బందులు లేకుండా ఉంటుంది అనే అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే నిన్న మెదక్, మల్కాజిగిరి లోక్ సభ నియోజకవర్గ నేతలతో మీనాక్షి నటరాజన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు సంబంధించిన ఫీడ్ బ్యాక్ పై సీఎంతో మీనాక్షి చర్చించినట్లు తెలుస్తోంది. కాగా కాంగ్రెస్ పార్టీకి లాయల్ గా ఉండేవారికే ఎమెల్సీగా అవకాశం ఇవ్వాలని పార్టీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పీసీసీసీ పెద్ద ఎత్తున దరఖాస్తులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. కాగా, రేపు కేబినెట్ భేటీ జరగనున్నది. అనంతరం కేబినెట్ నిర్ణయాలు, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక విషయంలో అధిష్టానంతో చర్చించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎల్లుండి మరోసారి ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోది.