Medak Municipal Chairman Election: మెదక్ మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అనుసరించిన వైఖరి ప్రజలను తప్పుదారి పట్టించేలా ఉందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్ రెడ్డి విమర్శించారు. సోమవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.
Read Also: TG Municipal elections: మహబూబ్నగర్ మేయర్ గా జి మమత ఎన్నిక..
అనైతిక పొత్తుకు నిదర్శనం
“ఢిల్లీలో కొట్లాడుకునే కాంగ్రెస్, బీజేపీ పార్టీలు.. ఇక్కడ మెదక్లో మాత్రం చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాయి” అని ఆమె ఎద్దేవా చేశారు. ఎంపీ ఎన్నికల నాటి నుంచే ఈ రెండు పార్టీల మధ్య రహస్య పొత్తు కొనసాగుతోందని, దానికి నిదర్శనమే నేటి మున్సిపల్ ఎన్నికల ఫలితాలని ఆరోపించారు. కాంగ్రెస్ కనుసైగల్లోనే బీజేపీ ప్రవర్తించిందని, కోరం కోసం హాజరైన బీజేపీ సభ్యులు ఓటింగ్లో ఎందుకు పాల్గొనలేదని ఆమె ప్రశ్నించారు.

అధికార పార్టీ అరాచకాలు.. భయపెట్టే ప్రయత్నాలు
ఎన్నికల నామినేషన్ ప్రక్రియ మొదలుకొని చైర్మన్ ఎన్నిక వరకు బీఆర్ఎస్ సభ్యులను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నాలు జరిగాయని పద్మాదేవేందర్ రెడ్డి మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే అనుచరులే దాడులకు తెగబడి, తిరిగి బీఆర్ఎస్ అభ్యర్థులనే ఇబ్బందులకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మెదక్లో ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి ఏకపక్షంగా ఎన్నిక నిర్వహించారని ఆమె విమర్శించారు.
Medak Municipal Chairman Election: ప్రలోభాలకు లొంగని బీఆర్ఎస్ సభ్యులు
ఎన్నికల్లో గెలవడానికి అధికార పార్టీ ఎన్ని ప్రలోభాలు పెట్టినా, బెదిరింపులకు పాల్పడినా బీఆర్ఎస్ కౌన్సిలర్లు లొంగకుండా ధైర్యంగా నిలబడ్డారని ఆమె కొనియాడారు. “మా సభ్యులు ఎక్కడా భయపడలేదు, అమ్ముడుపోలేదు. మెదక్ పట్టణ అభివృద్ధి విషయంలో అధికార పార్టీని నిరంతరం నిలదీస్తూనే ఉంటారు” అని స్పష్టం చేశారు. తమకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆమె ధన్యవాదాలు తెలిపారు.
ముఖ్య నేతల హాజరు
ఈ విలేకరుల సమావేశంలో పద్మాదేవేందర్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్సీలు ఫారూఖ్ హుస్సేన్, షేరీ సుభాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి, నియోజకవర్గ నాయకులు తిరుపతి రెడ్డి మరియు నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లు పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: