ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) అరెస్టు వ్యవహారం రాష్ట్ర రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తోంది. ఆయన అరెస్టును తెరాస (బీఆర్ఎస్) నేతలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR), మాజీ మంత్రి హరీశ్ రావులు (Harish Rao) తీవ్ర స్థాయిలో స్పందించారు.

కేటీఆర్ ఆగ్రహం:
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్టును ఖండించిన కేటీఆర్, ఈ చర్య పూర్తిగా అప్రజాస్వామికం అని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని, ఇది దుర్మార్గమైన చర్య అని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ అక్రమాలు, మంత్రుల అవినీతిని నిలదీస్తున్నందుకే బీఆర్ఎస్ నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. “పనికిరాని కేసులతో బీఆర్ఎస్ నాయకుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమై, ప్రజల దృష్టిని మరల్చడానికే ఇలాంటి దారుణాలకు ఒడిగడుతున్నారు” అని కేటీఆర్ విమర్శించారు. ప్రజల సమస్యలపై ప్రశ్నిస్తున్న నేతలను అణచివేయాలనే కుట్రల భాగమే అని వ్యాఖ్యానించారు.
తమ నేతలపై ఎన్ని అక్రమ కేసులు బనాయించినా, అవి న్యాయస్థానాల్లో నిలబడే అవకాశం లేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని ఎలాంటి షరతులు లేకుండా తక్షణమే విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా ప్రజల పక్షాన తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.
హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు:
మరోవైపు మాజీ మంత్రి హరీశ్ రావు కూడా ఈ అరెస్టును తీవ్రంగా ఖండించారు. ఆయన్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ తీరు ఎమర్జెన్సీ రోజులను గుర్తు చేస్తోందని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌశిక్ రెడ్డి అరెస్టు ప్రభుత్వ కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.
Read also: Phone tapping: డీజీపీ ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ చేశాను :ప్రభాకర్రావు