ఖమ్మం (Khammam) శివార్లలో దొంగల సంచారం స్థానికుల్లో భయాందోళనకు కారణమవుతోంది. ముఖ్యంగా గొల్లగూడెం ప్రాంతంలో ముగ్గురు దొంగలు (Three thieves) స్వేచ్ఛగా తిరుగుతున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ కావడంతో ఆందోళన మరింత పెరిగింది.
సీసీటీవీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలు
శనివారం తెల్లవారుజామున ముసుగులు ధరించిన ముగ్గురు అనుమానితులు వీధుల్లో సంచరిస్తూ కనిపించారు. వీరిలో ఒకరు ఓ ఇంటి తాళాన్ని పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. వారు ఇంట్లో పలు గదుల్లో డబ్బు, నగల కోసం తిరిగిన దృశ్యాలు ఇంట్లో అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా కనిపించాయి.
కాలనీవాసుల ఆందోళన, పోలీసులకు ఫిర్యాదు
వీడియోను పరిశీలించిన తరువాత కాలనీవాసులు తీవ్రంగా స్పందించారు. తమ ప్రాంతంలో రాత్రివేళ దొంగలు స్వేచ్ఛగా తిరుగుతూ ఇంట్లో చోరీకి యత్నించడం చూసి భయభ్రాంతులకు గురవుతున్నారు. వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇచ్చి, దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. కాగా, సత్తుపల్లి పట్టణంలో (Sathupalli town) ని పీవీ నరసింహారావు సింగరేణి కాలరీస్లోనూ దొంగలు చోరీకి యత్నించారు.
ప్రజలకు పోలీసుల సూచనలు
ఈ ఘటనల నేపథ్యంలో పోలీసులు ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. రాత్రివేళల్లో తాళం వేసిన ఇళ్లలో సెక్యూరిటీ ఏర్పాట్లు చేయాలని, సీసీటీవీలను అప్డేట్ చేయాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.