హైదరాబాద్ గచ్చిబౌలిలో పీజేఆర్ ఫ్లైఓవర్(PJR Flyover)ను ప్రారంభించిన అనంతరం జరిగిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) తన ప్రసంగాన్ని దివంగత నేత పి. జనార్దన్ రెడ్డి సేవలను స్మరించుకుంటూ ప్రారంభించారు. పీజేఆర్ పోరాటాల వల్లే హైదరాబాద్కు కృష్ణా, గోదావరి జలాలు రావడమేకాక, హైటెక్ సిటీ అభివృద్ధికి బీజం పడిందని గుర్తు చేశారు. దోమలగూడలోని పీజేఆర్ నివాసం ఒక “జనతా గ్యారేజీ”లా ఉండేదని సీఎం వ్యాఖ్యానించారు. నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి హైటెక్ సిటీకి శంకుస్థాపన చేయగా, చంద్రబాబు నాయుడు దాన్ని ముందుకు తీసుకెళ్లారని కొనియాడారు.
కంచ గచ్చిబౌలి వివాదంపై స్పష్టత – లక్షల ఉద్యోగాలకు మార్గం
గచ్చిబౌలి కంచ భూముల వివాదం తాత్కాలికమని స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి, ఈ ప్రాంత అభివృద్ధిలో ఎలాంటి ఆటంకం ఉండదన్నారు. కొత్తగా ఏర్పడే కంపెనీలతో దాదాపు 5 లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని ప్రకటించారు. “ఎంత మంది రాక్షసులు అడ్డుపడ్డా ఈ యజ్ఞం ఆగదు” అంటూ ఆయన హైటెక్ టౌన్షిప్ అభివృద్ధిపై ప్రభుత్వ నిబద్ధతను తెలియజేశారు. హైదరాబాద్ను న్యూయార్క్, టోక్యో లాంటి ప్రపంచ నగరాలతో పోటీపడే స్థాయికి తీసుకెళ్లే దిశగా తమ యత్నాలు కొనసాగుతున్నాయని చెప్పారు.
కాలుష్య నియంత్రణ – హైదరాబాద్కు భవిష్యత్తు ప్రణాళిక
హైదరాబాద్ను కాలుష్యరహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్లు సీఎం వివరించారు. డీజిల్ బస్సులను బయటకు పంపించి, నగరంలో 3,000 ఎలక్ట్రిక్ బస్సులను మాత్రమే తిరిగేలా చూస్తున్నామని తెలిపారు. నాలాల కబ్జాలే వరదలకు ప్రధాన కారణమని, అందుకే హైడ్రా ద్వారా అక్రమ నిర్మాణాలను కూల్చినట్టు వెల్లడించారు. బతుకమ్మకుంటను ఆక్రమించిన బీఆర్ఎస్ నేతల నుంచి తిరిగి ప్రభుత్వ అధీనంలోకి తీసుకున్నామని గుర్తుచేశారు. హైదరాబాద్పై ఒత్తిడి పెరుగుతున్నందున 30,000 ఎకరాల్లో “ఫ్యూచర్ సిటీ” ప్రణాళికను ప్రారంభించామని తెలిపారు.
Read Also : Dubai Crown Prince: లంచ్ కోసం రెస్టారెంట్కు వెళ్లి..అందరి బిల్లులు కట్టి సర్ప్రైజ్ చేసిన యువరాజు