జమ్మికుంట/హుజురాబాద్: కరీంనగర్ జిల్లాలో మధ్యాహ్న భోజనం నాణ్యతపై మరోసారి ఆందోళన వ్యక్తమైంది. జమ్మికుంట(Jammikunta) పట్టణంలోని ప్రభుత్వ బాలికల ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిన్న 25 మంది విద్యార్థులలో 17 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనతో అప్రమత్తమైన ఉపాధ్యాయులు వెంటనే వారిని చికిత్స కోసం జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు.
Read Also: Roads : రోడ్లపై గుంతలు లేకుండా చేయండి – చంద్రబాబు

ఆహారంలో పురుగులు, కుళ్ళిన గుడ్లు
మధ్యాహ్న భోజనం తిన్న విద్యార్థులను విలేకరులు ప్రశ్నించగా, భోజనంలో కుళ్లిపోయిన కోడిగుడ్ల వాసన వచ్చిందని, అన్నంలో పురుగులు ఉన్నాయని విద్యార్థులు ఆవేదనతో తెలిపారు. అస్వస్థతకు గురైన వారిలో 9 మంది బాలికలు, 8 మంది బాలురు ఉన్నారు. మొదట ముగ్గురు విద్యార్థులు వాంతులు చేసుకోవడంతో, ఆ తర్వాత మరికొంత మంది కడుపు నొప్పితో బాధపడటంతో ఉపాధ్యాయులు స్పందించారు. నాసిరకం వంటసామాగ్రి, చాలా రోజుల కింద పెట్టిన గుడ్ల వల్లే ఈ సమస్య తలెత్తిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
రాజకీయ నాయకుల ఆందోళన, అధికారుల హామీ
ఈ సంఘటన దావానలంలా వ్యాపించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, రాజకీయ ప్రముఖులు, అధికారులు పాఠశాల మరియు ఆసుపత్రికి చేరుకున్నారు. బిఆర్ఎస్ శాసనసభ్యుడు పాడి కౌశిక్ రెడ్డి, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్,(Bandi Sanjay Kumar) మాజీ మంత్రి ఈటల రాజేందర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి ఫోన్ చేసి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని కలెక్టర్ వెల్లడించారు. తహసిల్దార్ వెంకట్ రెడ్డి, మండల విద్యాధికారి హేమలత.. ఆహారంలో జరిగిన కలుషితంపై న్యాయ విచారణ చేసి, బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: