తెలంగాణలో సంక్షేమ పథకాల జాతర నడుస్తోంది. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26వ తేదీన రేవంత్ రెడ్డి సర్కార్.. నాలుగు సంక్షేమ పథకాలను ప్రారంభించింది. ఇందులో ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసాతో పాటు భూమి లేని రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని కూడా ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించింది. ఈ పథకం కింద.. భూమిలేని రైతు కూలీలకు సంవత్సరానికి రూ.12 వేల చొప్పున రెండు దఫాలుగా ఆర్థిక సాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ క్రమంలో.. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం విషయంలో బిగ్ ట్విస్ట్ నెలకొంది. తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. నారాయణపేటకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. భూమి లేని రైతు కూలీలకు ఏటా రూ.12 వేలు చెల్లించేలా రేవంత్ రెడ్డి సర్కార్ పథకం రూపొందించిందని.. పట్టణ (మున్సిపాలిటీల పరిధిలో) రైతు కూలీలకు మాత్రం డబ్బులు ఇవ్వడం లేదని శ్రీనివాస్ తన పిటిషన్లో పేర్కొన్నారు.

కాగా.. ఈ పిటిషన్పై న్యాయస్థానం విచారణ చేపట్టగా.. పిటిషనర్ తరఫున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రంలోని 129 మున్సిపాలిటీల్లో మొత్తంగా 8 లక్షల మందికి పైగా రైతు కూలీలు ఉన్నారని హైకోర్టుకు చిక్కుడ ప్రభాకర్ తెలిపారు. గ్రామాల్లోని రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇచ్చి.. మున్సిపాలిటీల్లోని వారికి ఇవ్వకపోవడం ఏమాత్రం సరికాదని తెలిపారు. రైతు కూలీలు అందరూ సమానమేనని.. ఎక్కడ ఉన్నా అందరూ కూలీలే అని వివరించారు. కేవలం గ్రామాల్లోని రైతు కూలీలకే పథకం వర్తింపజేయడం సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధమని న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాధించారు. పిటిషనర్ తరపు వాదనలు విన్న న్యాయస్థానం.. ఈ పిటిషన్పై 4 వారాల్లో తుది నిర్ణయం వెల్లడించాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.