Ibrahimpatnam Municipality: మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాల్లో ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది. పరిస్థితులు ఉద్రిక్తంగా మారే అవకాశముండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 400 మంది పోలీసు సిబ్బందితో పరిసర ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకుని పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. విధుల్లో ఎలాంటి నిర్లక్ష్యం చేయవద్దని, మనం చట్టం పక్షం తప్ప ఎవరి పక్షం కాదని ఏసీపీ కేపీవీ రాజు పోలీసులకు స్పష్టం చేశారు.
Read Also: KTR Formula E race : ఫార్ములా ఈ కేసు, కేటీఆర్పై చార్జిషీట్ ఈ వారం?

ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సమాచారం
ఏ రాజకీయ పార్టీకి ఫోన్ల ద్వారా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సమాచారం ఇచ్చినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే కొందరు సిబ్బంది తమ పర్యవేక్షణలో ఉన్నారని తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటలకు ఎన్నికల ప్రక్రియ జరగనుండగా, ఆర్డీఓ కే అనంతరెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ అధికారులు సమావేశ మందిరాన్ని సిద్ధం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ సాధించిన బిఆర్ఎస్ పార్టీ చైర్మన్ ఎన్నికకు సిద్ధమైంది. రాష్ట్ర నాయకుడు సత్తు వెంకటరమణారెడ్డి నేతృత్వంలో ఉదయం మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని ఏ–బీ ఫారంలను ఎన్నికల అధికారులకు సమర్పించారు. అలాగే కాంగ్రెస్ తరపున కౌన్సిలర్లు ఫారంలను సమర్పించారు.
అనంతరం స్థానిక ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డితో కలిసి కాంగ్రెస్(congress)కు చెందిన ఎనిమిది మంది కౌన్సిలర్లతో పాటు బీజేపీ పార్టీకి చెందిన 18వార్డు సభ్యులు సిద్ధం భానుప్రియ సమావేశ మందిరంలోకి ప్రవేశించారు.ఈ క్రమంలో ఇద్దరు కౌన్సిలర్లు కనిపించడం లేదని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కార్యకర్తలను భారీగా సమీకరించాయి. ఇబ్రహీంపట్నంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద కాంగ్రెస్ కార్యకర్తల రద్దీ కనిపించగా, బీఆర్ఎస్ కార్యకర్తలు పార్టీ కార్యాలయాలు, పరిసర ప్రాంతాల్లో చేరుకున్నట్లు సమాచారం.డీసీపీ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. నాలుగు మందికి మించి గుంపులుగా తిరగకుండా నియంత్రణలు అమలు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పరిస్థితిని పోలీసులు పూర్తిగా అదుపులో ఉంచారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: