हिन्दी | Epaper

Telangana Municipal Elections: ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో కారు హ్యాట్రిక్

Tejaswini Y
Telangana Municipal Elections: ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో కారు హ్యాట్రిక్

Telangana Municipal Elections: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు స్థానిక రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ, ఇబ్రహీంపట్నం ఓటర్లు మాత్రం మరోసారి బీఆర్ఎస్ (భారత రాష్ట్ర సమితి) వైపే మొగ్గు చూపారు. శుక్రవారం వెలువడిన ఫలితాల్లో బీఆర్ఎస్(BRS) ప్రభంజనం సృష్టించి, వరుసగా మూడోసారి మున్సిపల్ పీఠంపై గులాబీ జెండా ఎగురవేయడానికి మార్గం సుగమం చేసుకుంది. మొత్తం 24 వార్డులకు గాను బీఆర్ఎస్ సొంతంగా 13 స్థానాలను కైవసం చేసుకుని మెజారిటీ మార్కును అందుకుంది.

Read Also: BJP donations : బీజేపీకి వేల కోట్ల విరాళాలు, కాంగ్రెస్‌కు ఎందుకింత తక్కువ?

Telangana Municipal Elections: Car hat-trick in Ibrahimpatnam Municipality
Telangana Municipal Elections: Car hat-trick in Ibrahimpatnam Municipality

మున్సిపల్ ఎన్నికల ఫలితాలు అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ ఇచ్చాయి. బీఆర్ఎస్ 13 చోట్ల గెలిచి తన పట్టును నిరూపించుకోగా, కాంగ్రెస్ 8 స్థానాలకే పరిమితమైంది. బీజేపీ 2 స్థానాల్లో, ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థులు సాధించిన మెజారిటీలు ఆ పార్టీ క్షేత్రస్థాయి బలాన్ని చాటిచెప్పాయి.

బీఆర్ఎస్ విజేతలు వీరే:

వార్డు 4లో కొండ్రు ప్రవీణ్ కుమార్, వార్డు 5లో జెర్కొని మమత రాజు ముదిరాజ్, వార్డు 7లో టేకుల సుదర్శన్ రెడ్డి, వార్డు 11లో కొండ్రు శ్రీలత రాంబాబు, వార్డు 12లో కొండిగారి త్రిలోక్, వార్డు 15లో క్యామ శంకర్, వార్డు 16లో అల్వాల జ్యోతి వెంకట్ రెడ్డి, వార్డు 17లో మడుపు లక్ష్మమ్మ, వార్డు 19లో ఆకుల యాదగిరి, వార్డు 20లో మంద జయ, వార్డు 21లో చిలకల బుగ్గ రాములు, వార్డు 23లో నీలం శ్వేత, వార్డు 24లో గూడూరి గిరీష్ విజేతలుగా నిలిచారు.

మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మార్క్

ఈ విజయంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకు పక్కా ప్రణాళికతో వ్యవహరించిన ఆయన, ఫలితాల తర్వాత కూడా ఏమాత్రం అజాగ్రత్త వహించలేదు. కాంగ్రెస్ పార్టీ ఎక్స్ అఫిషియో ఓట్ల ద్వారా మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోవాలని చూస్తుందన్న సమాచారంతో ప్రశాంత్ రెడ్డి వెంటనే అప్రమత్తమయ్యారు. ఏ చిన్న అవకాశం ఇవ్వకూడదన్న ఉద్దేశంతో, గెలిచిన 13 మంది బీఆర్ఎస్ అభ్యర్థులతో పాటు, 3వ వార్డు స్వతంత్ర అభ్యర్థి దాసరి మురళీకృష్ణను కూడా తమ గూటికి చేర్చుకున్నారు. వీరందరినీ ప్రత్యేక వాహనాల్లో రహస్య ప్రాంతానికి (క్యాంపునకు) తరలించారు. కాంగ్రెస్ నేతలు ప్రలోభపెట్టే అవకాశం లేకుండా అందరి ఫోన్లను స్విచ్చాఫ్ చేయించి, పక్కాగా స్కెచ్ అమలు చేశారు.

వరుసగా రెండు పర్యాయాలు ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీని తన గుప్పిట్లో ఉంచుకున్న బీఆర్ఎస్, మూడోసారి కూడా పట్టు సాధించి హ్యాట్రిక్ దిశగా దూసుకుపోతోంది. 14 మంది సభ్యుల మద్దతుతో సురక్షితంగా ఉన్న గులాబీ దళం, చైర్మన్ ఎన్నిక రోజు నేరుగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకోనుంది. మొత్తం మీద ఇబ్రహీంపట్నం గడ్డపై ప్రశాంత్ రెడ్డి వ్యూహాల ముందు కాంగ్రెస్ కోటలు మరోసారి పేకమేడల్లా కూలిపోయాయి. మెజారిటీ దక్కినప్పటికీ, ఇప్పుడు చైర్మన్ పదవిని ఎవరు అధిరోహిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. పార్టీలో ముగ్గురు బలమైన నేతలు రేసులో ఉన్నారు. జేర్కొని మమతారాజు,టేకుల సుదర్శన్ రెడ్డి, అల్వాల జ్యోతి వెంకట్ రెడ్డి చైర్మన్ పీఠం కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారని జోరుగా చర్చలు సాగుతున్నాయి.

బీజేపీతో మంతనాలు.. వైస్ చైర్మన్ పదవిపై చర్చలు?

మున్సిపాలిటీలో కాంగ్రెస్ను పూర్తిస్థాయిలో నిలువరించేందుకు బీఆర్ఎస్ మరో ఎత్తుగడ వేస్తోంది. ఇందులో భాగంగా బీజేపీ అభ్యర్థుల మద్దతును కూడా కోరుతున్నట్లు సమాచారం. ఒకవేళ బీజేపీ మద్దతు ఇస్తే, ప్రతిఫలంగా 1వ వార్డు నుండి గెలిచిన ముత్యాల శ్యామల భాస్కర్కు వైస్ చైర్మన్ పదవి ఇచ్చేలా తెరవెనుక మంతనాలు జరుగుతున్నట్లు సమాచారం.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870